CPI Narayana: మీరు, మీ నాన్న పాదయాత్రలు చేసే ముఖ్యమంత్రులు అయ్యారు: సీఎం జగన్ ను ఉద్దేశించి సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

  • పాదయాత్రలంటే సీఎంకు ఎందుకంత కోపమన్న నారాయణ
  • రైతులు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో గమనించాలని హితవు
  • సీఎం అయ్యాక జగన్ గుణం మారిపోయిందని విమర్శలు
CPI Narayana comments on CM Jagan

రాజధాని రైతుల అమరావతి నుంచి అరసవిల్లి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. పాదయాత్రలు, ర్యాలీలు అంటే ముఖ్యమంత్రికి ఎందుకు కోపం? అని ప్రశ్నించారు. మీరు, మీ నాన్న (వైఎస్) పాదయాత్రలు చేసే కదా ముఖ్యమంత్రులైంది? అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

రైతులు పాదయాత్రను ఎందుకు చేస్తున్నారో గమనించాలని హితవు పలికారు. వారేమీ మిమ్మల్ని (సీఎం జగన్) ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని పాదయాత్ర చేయడంలేదని, అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టారని నారాయణ వివరించారు.

ఏదేమైనా, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక జగన్ గుణం మారిపోయిందని విమర్శించారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని జగన్ ఇచ్చిన హామీ ఏమైపోయిందని ప్రశ్నించారు. ఇప్పుడు చేపడుతున్న పాదయాత్ర అమరావతి రైతులు చేపడుతున్న రెండో పోరాటం అని నారాయణ అభివర్ణించారు.

More Telugu News