Pumpkin boat: గుమ్మడి పండుతో బోటు చేసుకుని.. 38 మైళ్లు నదిలో ప్రయాణం.. గిన్నిస్​ రికార్డు పట్టేశాడు!

  • అమెరికాలోని మిస్సోరీ నదిలో ఓ పెద్దాయన సాహసం
  • తన పుట్టిన రోజున ప్రత్యేకంగా ఫీట్ చేసిన డ్యూన్ హాన్సెన్
  • ఒంటరిగా 10 గంటలకుపైగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకున్న తీరు
Man travels on Pumpkin boat for record

సాధారణంగా నదిలో ఎలా ప్రయాణిస్తారు.. పడవల్లోనో, మరబోట్లలోనో వెళ్తారు. మహా అయితే తెప్పలు వాడుతారు. ఇవి కొద్ది దూరం వెళ్లడానికి మాత్రమే. కానీ డ్యూన్ హాన్సెన్ మాత్రం ఓ పెద్ద గుమ్మడి పండును బోటులా చేసుకుని నదిలో ఏకంగా 38 మైళ్లు (సుమారు 60 కిలోమీటర్లు) ప్రయాణం చేసి.. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు. అమెరికాలోని మిస్సోరీ నదిలో ఇటీవలే ఈ ఫీట్ చేశాడు. చిత్రమేమిటంటే.. ఇలా గుమ్మడి పండు బోటులో ప్రయాణించిన ఆయన వయసు 60 ఏళ్లు కావడం, అదీ ఆయన తన పుట్టినరోజున ఈ ఫీట్ చేయడం గమనార్హం.

పాత రికార్డును బ్రేక్ చేస్తూ..  

  • గుమ్మడి పండు బోట్ లో నదిలో ప్రయాణించిన రికార్డు ఇంతకు ముందు వాషింగ్టన్ కు చెందిన రిక్ స్వెన్సన్ అనే వ్యక్తి పేరు మీద ఉంది.  అతను 2016లో రెడ్ రివర్ నదిలో 25.5 మైళ్ల దూరం అలా ప్రయాణించాడు.
  • ఆ రికార్డును బీట్ చేయాలని డ్యూన్ హాన్సెన్ నిర్ణయించుకున్నాడు. ఓ పెద్ద గుమ్మడి పండు తెప్పించుకుని.. దాని లోపలి భాగమంతా తొలగించి చిన్న బోటులా మార్చుకున్నాడు. దాని లోపల కొన్ని అత్యవసరమైన సామగ్రి వేసుకుని, తెడ్డు పట్టుకుని నదిలో ప్రయాణించడం మొదలుపెట్టాడు. 
  • బెల్లూవ్స్  గ్రామం నుంచి నెబ్రస్కా పట్టణం వరకు 38 మైళ్ల దూరం ఈ గుమ్మడి పండు బోటులో డ్యూన్ ప్రయాణించాడు. పొద్దున 7.30కు బయలుదేరితే.. సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నాడు. 
  • ఎవరి సాయం లేకుండా ఒక్కడే తెడ్డు సాయంతో ప్రయాణిస్తూ వచ్చాడు. దీనంతటినీ గిన్నిస్ బుక్ ప్రతినిధులు పరిశీలించారు. మొత్తానికి పెద్దాయన సాధించేశాడు అంటూ రికార్డు ఇచ్చేశారు.

More Telugu News