Kerala: ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం వల్లే బీజేపీ సంఖ్య పెరిగింది.. అమిత్ షాపై సీపీఎం ఫైర్

  • కేరళలో వచ్చే ఎన్నికల్లో కమలం వికసిస్తుందన్న అమిత్ షా వ్యాఖ్యలపై విమర్శ
  • కేరళలో గతంలో ఉన్న ఒక్క కమలం కూడా వాడిపోయిందని ఎద్దేవా
  • అమిత్ షా పగటి కలలు కంటున్నారని వ్యాఖ్య
Kerala CPM fires on Amit shah

బీజేపీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే తమ సంఖ్యను పెంచుకుందని.. ఆ పార్టీ అవినీతిమయమని సీపీఎం మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు అంతరించిపోయే దశలో ఉన్నాయని.. దేశంలో బీజేపీదే భవిష్యత్తు అంటూ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ప్రతిపక్షాల నుంచి మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనడం బీజేపీకి పరిపాటి అయిపోయిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి ఎంఏ బేబీ ఆరోపించారు. బీజేపీ అవినీతి రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

ఆ ఒక్కటీ వాడిపోయింది..
2016లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్ల సాయంతో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుందని ఎంఏ బేబీ గుర్తు చేశారు. ఆ తర్వాత 2021లో జరిగిన ఎన్నికల్లో ఆ ఒక్క స్థానాన్ని కూడా కోల్పోయిందని చెప్పారు. గతంలో కేరళలో వికసించిన ఒక్క కమలం కూడా కుళ్లిపోయిందని, ఈ విషయం అమిత్ షా మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేరళలో బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే.. కమలం వికసిస్తుందంటూ అమిత్‌ షా పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు.


More Telugu News