Arvind Kejriwal: రూ. 5,500 కోట్లు ఖర్చు పెట్టి 277 మంది ఎమ్మెల్యేలను కొన్నారు: బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

  • దేశ వ్యాప్తంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోందన్న కేజ్రీవాల్
  • ఒక్కో ఎమ్మెల్యేను రూ. 20 కోట్లకు కొనుగోలు చేస్తున్నారని మండిపాటు
  • ఝార్ఖండ్ ను టార్గెట్ చేశారని.. ఢిల్లీపై కన్నేశారని విమర్శ
BJP bought 277 MLAs spending Rs 5500 crores says Arvind Kejriwal

బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇప్పటి వరకు ఇతర పార్టీలకు చెందిన 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల చొప్పున బీజేపీ చెల్లించిందని తెలిపారు. ఈ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ రూ. 5,500 కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. ఇతర పార్టీ టికెట్లపై గెలిచిన ఈ ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయి బీజేపీలో చేరిపోయారని విమర్శించారు. 

ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టుగా బీజేపీ కొనడంతోనే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని కేజ్రీ అన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ఉపయోగించిన సొమ్మంతా సామాన్యుల నుంచి వసూలు చేసిందేనని... అందుకే ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో దేశంలో సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ దేశ వ్యాప్తంగా కొనసాగుతోందని కేజ్రీవాల్ అన్నారు. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేశారని... ఇప్పుడు ఝార్ఖండ్ పై దృష్టిని సారించారని విమర్శించారు. ఢిల్లీపై కూడా వారు కన్నేశారని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్రకు తెరతీశారని విమర్శించారు. 

మరోవైపు, తాజాగా తన నివాసంలో కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశానికి ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఇంకోవైపు, 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బీజేపీ తమను సంప్రదించిందంటూ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలు చెప్పడం కలకలం రేపుతోంది. తమ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ. 800 కోట్లను కేటాయించిందని కేజ్రీవాల్ మండిపడ్డారు.

More Telugu News