Bandi Sanjay: దాడులు, అక్రమ కేసులతో నా పాదయాత్రను అడ్డుకోవాలని చూశారు: బండి సంజయ్

  • బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా
  • ప్రభుత్వం నికృష్ట ఆలోచనలు మానుకోవాలన్న బండి సంజయ్
  • పాదయాత్ర ఆపేందుకు కుట్రలు చేశారని ఆరోపణ
  • కేసీఆరే ఘర్షణలు రెచ్చగొడుతున్నారని వెల్లడి
Bandi Sanjay fires on CM KCR and TRS govt

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగింపుకు హైకోర్టు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బండి సంజయ్ స్పందించారు. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేశారని మండిపడ్డారు. దాడులు, అక్రమ కేసులతో తన పాదయాత్రను కొనసాగనివ్వకుండా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ప్రభుత్వం ఇకనైనా నికృష్ట ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. 

రంగారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. అధికారిక కార్యక్రమంలో ప్రధానిపై ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తారా? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టును మోదీయే ఆపారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. పంటలు కావాలా? మంటలు కావాలా? అని కేసీఆర్ మాట్లాడుతున్నారని, వరి వేస్తే ఉరి అని చెప్పింది మీరు కాదా? అంటూ బండి సంజయ్ నిలదీశారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని అన్నారు. బీజేపీ పేరు చెప్పుకుంటూ కేసీఆరే ఘర్షణలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మత ఘర్షణలు లేవన్న విషయం గుర్తించాలని స్పష్టం చేశారు.

More Telugu News