Andhra Pradesh: ‘ఇంపాక్ట్ ఫీజు’ను అమల్లోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం.. ప్రధాన రహదారుల పక్కన నిర్మాణాలు చేపడితే లక్షలు చెల్లించుకోవాల్సిందే!

  • ఉత్తర్వులు విడుదల చేసిన పురపాలక శాఖ
  • ఇప్పటికే ఉన్న లైసెన్స్, ఇతర చార్జీలకు ఇది అదనం
  • ఇలా వచ్చిన డబ్బులను రహదారుల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం
Andhrapradesh Govt impose impact fee

ఇంపాక్ట్ ఫీజు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మరో భారం మోపింది. నగరాలు, పట్టణాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రహదారుల పక్కన కొత్తగా భవనాలు నిర్మించే వారు ఈ ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర చార్జీలకు అదనంగా ఇకపై ‘ఇంపాక్ట్ ఫీజు’ను కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పురపాలక శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న రహదారులతోపాటు నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా రహదారుల నిర్మాణానికి భూసేకరణ దశలో ఉన్న చోట కూడా ఫీజు కట్టాల్సిందేనని పేర్కొంది. 

ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర చార్జీలకు అదనంగా దీన్ని చెల్లించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 60 అడుగులు, ఆపైన.. 150 అడుగులు వెడల్పున్న రహదారుల్ని ఆనుకుని నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకూ ఇది వర్తిస్తుందని వివరించింది. అంతేకాదు, 150 అడుగులు, అంతకుమించి వెడల్పు ఉన్న రహదారులకు రెండు పక్కలా 250 మీటర్ల దూరం వరకు నిర్మించే అన్ని రకాల భవనాలకు ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా బిల్డప్ ఏరియాలో ప్రతీ చదరపు అడుగుకు ఇంత మొత్తమని నిర్ణయించింది. దీనిని అక్కడి స్థలం రిజిస్ట్రేషన్ విలువలో రెండు నుంచి మూడుశాతం కానీ, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దానిని వసూలు చేస్తారు. 

More Telugu News