Rohit Sharma: టీ20 కెప్టెన్‌గా కోహ్లీ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ

  • పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ కెప్టెన్‌గా రోహిత్‌శర్మ
  • 60 సిక్సర్లతో కోహ్లీని దాటేసిన వైనం
  • విండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఘనత
Rohit Sharma surpasses Virat Kohli to hit most sixes as India captain in T20Is

వెస్టిండీస్‌తో గత రాత్రి జరిగిన మూడో టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఆడి ఒక ఫోర్, మరొక సిక్సర్‌తో 11 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ రోహిత్‌శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

పొట్టి క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇండియన్ స్కిప్పర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుగొట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్ లో కోహ్లీ, రోహిత్ శర్మ 59 సిక్సర్లతో సమానంగా ఉన్నారు. తాజా మ్యాచ్‌లో అల్జారీ జోసెఫ్ బౌలింగులో సిక్సర్ బాదిన రోహిత్.. కోహ్లీని దాటేసి టీ20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేర రాసుకున్నాడు.

గత రాత్రి జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మేయర్స్ 73 పరుగులతో టాప్  స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 165 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

More Telugu News