YSRCP: జ‌గ‌న్ గ్రాఫ్ త‌గ్గింద‌న్న స‌ర్వే రిపోర్ట్‌పై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పంద‌న ఇదే

  • సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ స్టడీస్ స‌ర్వేగా చెప్పిన నాని
  • ఆ సంస్థ టీడీపీ వ్యూహ‌కర్త రాబిన్ శ‌ర్మ‌ద‌న్న వైసీపీ ఎమ్మెల్యే
  • గ్రాఫ్ ‌ను పెంచుకునే టీడీపీ య‌త్నాలు ఫ‌లించ‌లేద‌ని ఆరోప‌ణ‌
  • జ‌గ‌న్ గ్రాఫ్‌ను ఎవ‌రూ త‌గ్గించ‌లేర‌ని వెల్ల‌డి
ysrcp mla perni nani hits back on a survey which shows that jagan graph fell down

ఏపీలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ అంత‌కంత‌కూ త‌గ్గిపోతోందంటూ విప‌క్ష టీడీపీ విడుద‌ల చేసిన ఓ స‌ర్వే రిపోర్టుపై వైసీపీ కృష్ణా జిల్లా అధ్య‌క్షుడు, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని   నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ స‌ర్వే చేప‌ట్టిన సంస్థ పేరు సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ స్టడీస్ అని, అది టీడీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త రాబిన్ శ‌ర్మ‌ద‌ని నాని ఆరోపించారు. టీడీపీకి రాజ‌కీయ వ్యూహాలు అందిస్తున్న రాబిన్ శ‌ర్మ నేతృత్వంలోని సంస్థ వైసీపీకి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గన్‌కు వ్య‌తిరేకంగా రిపోర్టు ఇవ్వ‌కుండా మ‌రెలా ఇస్తుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

పవన్‌ కల్యాణ్‌ ద్వారా త‌న‌ గ్రాఫ్‌ పెంచుకోవాలని టీడీపీ చూసింద‌ని, అయితే అది సాధ్యం కాలేదని నాని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు నారా చంద్రబాబు, లోకేశ్ వల్ల తెలుగుదేశం పార్టీ గ్రాఫ్‌ లేవడం లేదని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ తరువాత ఇక టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయిందని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. 

మునిగిపోతున్న టీడీపీని కాపాడుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి బోగస్‌ సర్వేను బయటకు వదిలారని నాని ధ్వజమెత్తారు. ఇలాంటి సర్వేలు జ‌గ‌న్ గ్రాఫ్‌ను ఏమీ చేయ‌లేవ‌న్న నాని.. జగన్‌ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్‌ నాయకత్వంపైనా ప్రజల్లో బలమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయ‌ని నాని పేర్కొన్నారు.

More Telugu News