Pharma: 'డోలో–650' మాత్రలు తయారు చేసే ఫార్మా కంపెనీపై ఐటీ దాడులు

  • మైక్రో ల్యాబ్స్ ఔషధ తయారీ సంస్థపై  దేశవ్యాప్తంగా 40 చోట్ల దాడులు
  • ఏక కాలంలో తనిఖీలు చేసిన 200 మందికిపైగా అధికారులు
  • కరోనా సమయంలో భారీగా పెరిగిన డోలో ట్యాబ్లెట్ల అమ్మకాలు
  • గణనీయ స్థాయిలో ఆదాయం పొందిందనే అభిప్రాయం నేపథ్యంలో తాజా ఐటీ దాడులు
income tax search dolo 650 manufacturer micro lab

దేశవ్యాప్తంగా బాగా ఆదరణ ఉన్న డోలో–650 (పారాసిటమాల్ 650 ఎంజీ) మాత్రల తయారీ సంస్థపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా డోలో మాత్రల వినియోగం విపరీతంగా పెరగడం, వాటి తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ ఫార్మా సంస్థ గణనీయంగా లాభాలు ఆర్జించడం వంటి వార్తల నేపథ్యంలో తాజా ఐటీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కంపెనీ బెంగళూరు ప్రధాన కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో 200 మందికిపైగా అధికారులు సోదాలు చేసినట్టు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. పలు కీలక పత్రాలు సేకరించినట్టు పేర్కొన్నాయి.

ఎక్కువ డోసుతో.. విస్తృత వినియోగం..
మన దేశంలో మొదటి నుంచీ 500 మిల్లీగ్రాముల పారాసిటమాల్ మాత్రలు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. చాలా సంస్థలు 500 ఎంజీ మాత్రలను తయారు చేస్తున్నా.. మైక్రో ల్యాబ్స్ సంస్థ డోలో–650 పేరిట కాస్త ఎక్కువ డోసు ఉన్న మాత్రలను మార్కెట్లోకి తెచ్చింది. జ్వరం తీవ్రంగా ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్లను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ డోసు పారాసిటమాల్ మార్కెట్లో డోలో ఎక్కువగా ఆదరణ పొందింది. ఇతర కంపెనీలు కూడా ఆ తర్వాత 650 ఎంజీ పారాసిటమాల్ మాత్రలను మార్కెట్లోకి తెచ్చినా డోలోకే డిమాండ్ ఎక్కువగా ఉంది.

ఇలాంటిది కరోనా సమయంలో ఎక్కువ డోసు పారాసిటమాల్ ను వైద్యులు సిఫార్సు చేయడంతో డోలో వినియోగం విపరీతంగా పెరిగింది. సుమారు రెండేళ్లలో ఈ సంస్థ 350 కోట్లకుపైగా డోలో ట్యాబ్లెట్లను విక్రయించిందని, ఒక్క ఏడాదిలో సుమారు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి.

More Telugu News