Raghu Rama Krishna Raju: భీమవరం రాకుండానే మధ్యలోనే రైలు దిగి వెళ్లిపోయిన రఘురామరాజు

  • హైదరాబాద్ నుంచి రైలులో భీమవరానికి రఘురామరాజు
  • ఆయన అభిమానులపై కేసులు పెట్టారని తెలుసుకుని తీవ్ర మనస్తాపం
  • ప్రొటోకాల్ విషయంలో అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన
MP Raghuramaraju get off From train in the middle before reaching Bhimavaram

ఆంధ్రప్రదేశ్‌లో నేటి ప్రధానమంత్రి పర్యటనలో పాల్గొంటానని చెబుతూ వస్తున్న నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏపీకి రాకుండానే వెనక్కి మళ్లారు. మోదీ పర్యటనలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రఘురామరాజు.. భీమవరం వెళ్లేందుకు గతరాత్రి హైదరాబాద్‌లో రైలెక్కారు. 

ఈ క్రమంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. శనివారం ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారన్నది ఆ ఫోన్ సారాంశం. యువకుల తండ్రులే ఆ ఫోన్ చేసి విషయం చెప్పారు. 

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రఘురామ కృష్ణరాజు మధ్యలోనే రైలు దిగి వెళ్లిపోయారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ అన్నారు. యువకులపై కేసు పెట్టడం రఘురామను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, అందుకనే ఆయన భీమవరం రాకుండానే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది.

More Telugu News