Dakshin Express: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

  • భువనగిరి-పగిడిపల్లి మధ్య ఘటన
  • అర్ధ రాత్రి ఒంటి గంట సమయంలో ఘటన
  • సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో సహాయక సిబ్బంది
  • మంటలను అదుపు చేసిన సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది
Fire Accident in Dakshin Express

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రైలు దిగి పరుగులు తీశారు. భువనగిరి-పగిడిపల్లి మధ్య గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో రైలు చివరి బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన రైల్వే సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు. 

మంటలు చూసిన ప్రజలు భయంతో రైలు దిగి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అంటుకున్న బోగీ లగేజీ క్యారియర్ అని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఎవరైనా గాయపడిందీ లేనిదీ తెలియరాలేదు.

More Telugu News