kapil dev: ఎవరైతే ఏంటి? 14 మ్యాచుల్లో ఒక్క ఫిప్టీ కూడా చేయకపోతే..: కపిల్ దేవ్

  • పేరుతో ఎక్కువ కాలం కొనసాగలేరన్న కపిల్  
  • పరుగులు సాధించాల్సిందేనని సూచన
  • లేదంటే అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరిక
  • ఆటలో విఫలమైతే విమర్శకులు మౌనంగా ఉండలేరని వ్యాఖ్య 
Does not matter if you are Tendulkar or Gavaskar If you dont score a 50 in 14 games Kapil

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఒత్తిడి పెరుగుతోంది. వరుసగా అతడు బ్యాటింగ్ లో విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో అతడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై కెప్టెన్ గా అతడు రాణించలేకపోయాడు. లీగ్ దశ నుంచే ముంబై జట్టు నిష్క్రమించింది. లీగ్ దశలోని 14 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్కదానిలోనూ కనీసం 50 (ఫిఫ్టీ) పరుగులు కూడా చేయలేకపోవడం గమనార్హం. 

రోహిత్ శర్మ తన కెరీర్ లోనే అత్యంత గడ్డు పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాడని చెప్పుకోవాలి. ఈ క్రమంలో జులై 1 నుంచి ఇంగ్లండ్ గడ్డపై ఆతిథ్య జట్టుతో భారత టెస్ట్ జట్టు ఒక మ్యాచ్ ఆడనుంది. కనీసం అందులో అయినా రోహిత్ బ్యాటింగ్ లో రాణించి, మ్యాచ్ ను గెలిపించుకుంటే విమర్శల వాన కొద్దిగా తగ్గుతుంది.

టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ స్పందిస్తూ.. ‘‘రోహిత్ నిజంగా తెలివైన వాడు. అందులో సందేహం లేదు. 14 మ్యాచుల్లో ఒక్క ఫిఫ్టీ కూడా చేయకపోతే ప్రశ్నలు ఎదురవుతాయి. అది గ్యారీ సోబర్స్, డాన్ బ్రాడ్ మ్యాన్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ లేదా రిచర్జ్స్ అయినా కావచ్చు. ఏం జరుగుగుతుందన్నది రోహితే చెప్పాలి. క్రికెట్ ఆడడం ఎక్కువైపోయిందా? లేక ఆటను ఆస్వాదించడం ఆపేశాడా? 

రోహిత్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు ఆటను కచ్చితంగా ఆస్వాదించాలి. ఆ ఆటగాళ్ల ద్వయం చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంటే విమర్శకులు మౌనంగా కూర్చోలేరు. కేవలం పేరుతో ఎక్కువ కాలం కొనసాగలేరు. పరుగులు సాధించాల్సిందే. లేదంటే అవకాశాలు తగ్గిపోతాయి’’ అని కపిల్ దేవ్ అన్నారు. రోహిత్ మాదిరే విరాట్ కోహ్లీ సైతం ఐపీఎల్ 2022 లో మెప్పించేలా ఆడడంలో విఫలమయ్యాడు. కెప్టెన్సీ బాధ్యతలు వదిలేసినా కానీ, అతడు బ్యాటింగ్ తీరు మారలేదు.

More Telugu News