Tata Nexon: టాటా నెక్సాన్ ఈవీ అగ్ని ప్రమాదంపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం

  • మూడు కేంద్ర సంస్థలకు దర్యాప్తు బాధ్యత అప్పగింత
  • కేంద్ర రవాణా, రహదారుల శాఖ నిర్ణయం
  • టాటా మోటార్స్ సైతం సొంతంగా దర్యాప్తు
Tata Nexon EV fire Centre orders separate probe

టాటా నెక్సాన్ ఈవీ కారు అగ్ని ప్రమాదానికి గురి కావడంపై ప్రత్యేక దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గత మంగళవారం ముంబైలోని వెస్ట్ వాసాయ్ ప్రాంతంలో రెస్టారెంటు ముందు నిలిపి ఉంచిన టాటా నెక్సాన్ ఈవీ కారులో మంటలు ఎగసిపడిన విషయం తెలిసిందే. 

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరి విస్తృత ప్రచారానికి నోచుకోవడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దీనిపై పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. నెక్సాన్ ఈవీ అగ్ని ప్రమాదంపై తాము పూర్తి స్థాయి విచారణ నిర్వహించనున్నట్టు టాటా మోటార్స్ సైతం ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్వతంత్ర దర్యాప్తు చేయించాలని నిర్ణయం తీసుకోవడం సంఘటనకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. 

సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ ప్లోజివ్ అండ్ ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరేటరీ దర్యాప్తు నిర్వహించాలంటూ కేంద్ర రవాణా, రహదారుల శాఖ ఆదేశించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను తెలుసుకోవడంతోపాటు.. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా నివారణ చర్యలను ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సూచించనున్నాయి. టాటా నెక్సాన్ దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కారు కావడం గమనార్హం. 

More Telugu News