Sai Pallavi: తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పట్ల సాయిపల్లవి స్పందన

  • ఇటీవల సాయిపల్లవి వ్యాఖ్యలపై దుమారం
  • కశ్మీరీ పండిట్ల అంశంపై సాయిపల్లవి వ్యాఖ్యలు
  • తాజాగా ఓ వీడియో విడుదల చేసిన వైనం
  • తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ
Sai Pallavi gives explanation on her comments

ఇటీవల నటి సాయిపల్లవి కశ్మీరీ పండిట్ల ఊచకోత, ఆవులను తరలిస్తున్న వ్యక్తుల హత్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కొందరు సాయిపల్లవిని తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. కాగా, తన వ్యాఖ్యలు దుమారం రేపుతుండడం పట్ల సాయిపల్లవి స్పందించారు. తన వివరణతో ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సాయిపల్లవి ఆరోపించారు. తాను మాట్లాడిన మాటల్లో కొన్నింటినే పరిగణనలోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు. మీరు రైట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? లెఫ్ట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించారని, ముందు మనం మంచి మనుషులుగా జీవించాలన్న ఉద్దేశం వచ్చేట్టు సమాధానం ఇచ్చానని సాయిపల్లవి స్పష్టం చేశారు. కానీ, తాను చెప్పిన విషయాలను తప్పుగా అర్థం చేసుకుని ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

హింస అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని ఉద్ఘాటించారు. తాను మొదట ఓ డాక్టర్ నని, ప్రాణం విలువ తనకు తెలుసని పేర్కొన్నారు. ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు తనను క్షమించాలని అన్నారు. గత కొన్నిరోజులుగా తనపై వస్తున్న విమర్శల పట్ల స్పందించడానికి చాలా ఆలోచించాల్సి వచ్చిందని సాయిపల్లవి తెలిపారు. తన మాటలు ఎవరినీ బాధించకూడదనే భావిస్తానని స్పష్టం చేశారు.

More Telugu News