Arvind Kejriwal: కశ్మీర్ సమస్యను పరిష్కరించడం బీజేపీ వల్ల కాదు: కేజ్రీవాల్

  • కశ్మీర్ లో లక్షిత హత్యలు
  • కశ్మీరీ పండిట్లను చంపుతున్న దుండగులు
  • బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
  • కశ్మీర్ అంశంలో రాజకీయాలు చేయొద్దని హితవు
Arvind Kejriwal says BJP can not solve Kashmir issue

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ కార్యకర్తలు నిర్వహిస్తున్న 'జన్ ఆక్రోశ్' నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ లో కశ్మీరీ పండిట్లను బలవంతంగా తరలిస్తున్నారని ఆరోపించారు. 1990లో ఏంజరిగిందో మళ్లీ అదే జరుగుతోందని అన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడం బీజేపీ వల్ల కాదని కేజ్రీవాల్ విమర్శించారు. బీజేపీకి తెలిసిందల్లా చెత్త రాజకీయాలు చేయడమేనని వ్యాఖ్యానించారు. దయచేసి కశ్మీర్ అంశంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. 

కశ్మీర్ లో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము ఏంచేయబోతున్నది కేంద్రం ప్రజలకు వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్లు కశ్మీర్ వెలుపల ఉద్యోగాలు చేయరాదంటూ సంతకాలు చేయించుకున్న బాండ్ పత్రాలను రద్దు చేయాలని అన్నారు. కశ్మీరీ పండిట్ల అన్ని డిమాండ్లను పరిష్కరించాలని, వారికి భద్రత కల్పించాలని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా కేజ్రీవాల్ పాకిస్థాన్ పైనా వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం పాకిస్థాన్ మానుకోవాలని హితవు పలికారు. కశ్మీర్ అంశంలో కుయుక్తులకు పాక్ స్వస్తి పలకాలని అన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని ఉద్ఘాటించారు.

More Telugu News