Hyderabad: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మరో సంచలన విషయం.. నిందితులకు ఫాం హౌస్ లో ఆశ్రయం ఇచ్చిన రాజకీయ నేత

  • మరో మైనర్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గుల్బర్గాలో అరెస్ట్.. రహస్య ప్రాంతంలో విచారణ
  • సిమ్ లను వేరే ఇద్దరి వ్యక్తుల ఫోన్లలో వేసిన నిందితులు
  • వారిని గోవాకు పంపించి.. వీళ్లు కర్ణాటకకు పరార్
Another Sensational Thing In Jubilee Hills Rape Case

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన విషయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్న ఒక మైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకొచ్చారు. అతడిని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తున్నారు. దీనితో కలిపి కేసులో ఇప్పటిదాకా పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టయింది. పరారీలో ఉన్న ఇంకో యువకుడి కోసం గాలిస్తున్నారు. 

నిన్న హైదరాబాద్ సిటీ శివారులోని మొయినాబాద్ లో ఉన్న ఒక ఫాం హౌస్ వద్ద ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నిందితులు ఓ రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్ లోనే తలదాచుకున్నారని, అక్కడి నుంచే వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారని తెలుస్తోంది. ఇన్నోవా కారును ఆ ఫాం హౌస్ వెనుక దాచినట్టు చెబుతున్నారు. 

నిందితులు ఇద్దరు వ్యక్తుల ఫోన్లలో తమ సిమ్ కార్డులను వేసి వారిని గోవాకు పంపించారని, ఆ తర్వాత వీళ్లు కర్ణాటకకు పారిపోయారని సమాచారం. నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ఫాం హౌస్ యజమాని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసులో ఓ నిందితుడి తండ్రి అయిన చైర్మన్ దే ఆ ఫాం హౌస్ అని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరో నిందితుడు ఉమేర్ ఖాన్ ను ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు.   

More Telugu News