Mumbai Indians: ఐపీఎల్-15: ఢిల్లీపై టాస్ గెలిచిన ముంబయి

  • ఐపీఎల్ లో నేడు ఢిల్లీ వర్సెస్ ముంబయి
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • గెలిస్తే ప్లే ఆఫ్ చేరనున్న ఢిల్లీ
  • ఢిల్లీ ఓడితే బెంగళూరుకు చాన్స్
Mumbai Indians won the toss against Delhi Capitals

ఐపీఎల్ తాజా సీజన్ లీగ్ దశలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా, టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీ ఓడితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్ లో అడుగుపెడుతుంది. అందుకే ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు గెలవాలని బెంగళూరు కోరుకుంటోంది. 

ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. లలిత్ స్థానంలో పృథ్వీ షా జట్టులోకి వచ్చాడని వివరించాడు. అటు, ముంబయి జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. స్టబ్స్ స్థానంలో డివాల్డ్ బ్రెవిస్ జట్టులోకి రాగా, సంజయ్ స్థానంలో షోకీన్ ను తీసుకున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. 

టాస్ సమయంలో వర్షం పడడంతో మ్యాచ్ నిర్వహణపై ఆందోళన నెలకొంది. అయితే కొద్దిసేపటికే వర్షం ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు ఈ ఐపీఎల్ లోనూ ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్-15లో ముంబయికి ఇదే చివరి మ్యాచ్ కాగా, ఆ జట్టు సాంకేతికంగా ఎప్పుడో నిష్క్రమించింది. 

టోర్నీలో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఒక్క బెర్తు కోసం ఢిల్లీ, బెంగళూరు మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం బెంగళూరు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ 14 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఢిల్లీకి కూడా 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం బెంగళూరు రన్ రేట్ (-0.253) మైనస్ లో ఉండగా, ఢిల్లీ రన్ రేట్ ( 0.255) ప్లస్ లో ఉంది.
.

More Telugu News