Congress: బీజేపీకి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు: రాహుల్ గాంధీ

  • చింత‌న్ శిబిర్‌లో  రాహుల్ గాంధీ కీల‌క ప్ర‌సంగం
  • నేనెన్న‌డూ అవినీతికి పాల్ప‌డ‌లేదు
  • కాంగ్రెస్ నామ‌స్మ‌ర‌ణ‌లో బీజేపీ అన్న కాంగ్రెస్‌ అగ్ర‌నేత‌
rahul gandhi says will not fear of bjp

భార‌తీయ జ‌న‌తా పార్టీకి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ‌స్ధాన్‌లోని ఉద‌య్ పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న న‌వ‌సంక‌ల్ప్ చింత‌న్ శిబిర్‌లో భాగంగా మాట్లాడిన రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో ద‌ళితుల‌కు స‌రైన స్థాన‌మే లేద‌న్న రాహుల్‌... కాంగ్రెస్ పార్టీలో మాత్రం అన్ని వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని తెలిపారు. 

ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధం క‌లిగి ఉండ‌ట‌మ‌నేది కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అయితే ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌తో పార్టీకి సంబంధాలు తెగిపోయాయ‌న్న ఆయ‌న‌.. ఈ విష‌యాన్ని అంద‌రూ అంగీక‌రించాల్సిందేన‌న్నారు. ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు య‌త్నించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ య‌త్నం ఒక్క‌రోజో, రెండు రోజుల్లోనో ముగియ‌రాదన్న రాహుల్‌.. నెల‌ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డాల్సిందేన‌ని చెప్పారు.

దేశాన్ని ముందుకు న‌డిపించే స‌త్తా ఒక్క కాంగ్రెస్‌కే ఉంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంద‌ని రాహుల్ గాంధీ తెలిపారు. తాను ఎన్న‌డూ అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. బీజేపీపై పోరాటం కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. కాంగ్రెస్ మాదిరిగా ప్రాంతీయ పార్టీలు పోరాటం చేయ‌లేవ‌న్న రాహుల్ గాంధీ... బీజేపీ కూడా నిత్యం కాంగ్రెస్ నామ‌స్మ‌ర‌ణే చేస్తోంద‌న్నారు.

More Telugu News