Riyan Parag: రియాన్ పరాగ్ ధనాధన్ ఫిఫ్టీ... బెంగళూరు లక్ష్యం 145 రన్స్

  • పూణేలో జరుగుతున్న మ్యాచ్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 రన్స్
  • 31 బంతుల్లో 56 పరుగులు చేసిన పరాగ్
Riyan Parag fifty helps Rajasthan Royals to post reasonable score

రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు ఓ మోస్తరు లక్ష్యం నిలిచింది. రియాన్ పరాగ్ ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 31 బంతుల్లోనే 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. హేజెల్ వుడ్ బౌలింగ్ లో హసరంగ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పరాగ్ ఆపై భారీ షాట్లతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

అంతకుముందు, రాజస్థాన్ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. జోరు మీదున్న జోస్ బట్లర్ ఈసారి 8 పరుగులకే అవుటై నిరాశ పరిచాడు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (7) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కెప్టెన్ సంజు శాంసన్ (27), అశ్విన్ (17), డారిల్ మిచెల్ (16) ఓ మోస్తరుగా రాణించారు. ఆదుకుంటాడనుకున్న హెట్మెయర్ (3) ఓ బంతిని గాల్లోకి లేపి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. బెంగళూరు బౌలర్లలో హేజెల్ వుడ్ 2, సిరాజ్ 2, హసరంగ 2, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.

More Telugu News