Mahesh Babu: చిరంజీవి 'ఆచార్య' సినిమాలో భాగస్వామి అయిన మహేశ్ బాబు!

  • ఈ నెల 29న విడుదలవుతున్న 'ఆచార్య' సినిమా
  • పాదఘట్టం సన్నివేశానికి వాయిస్ ఓవర్ చెప్పిన మహేశ్ బాబు
  • సినిమాలో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పిన చిరంజీవి
Mahesh Babu gives voice over to Chiranjeevi movie Acharya

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుందని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. 

మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమాలో భాగస్వామి అయ్యారు. దేవాలయాలలో అవినీతి నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం 'ధర్మస్థలి' పేరుతో భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోకి ప్రేక్షకులను తీసుకెళ్లే క్రమంలో మహేశ్ బాబు వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ సందర్భంగా మహేశ్ కి చిరంజీవి, కొరటాల శివ ధన్యవాదాలు తెలిపారు. 


ట్విట్టర్ ద్వారా చిరంజీవి స్పందిస్తూ, 'డియరెస్ట్ మహేశ్... 'ఆచార్య'లోని పాదఘట్టాన్ని నీ వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రత్యేకమైన విధంగా ఈ సినిమాలో భాగమైనందుకు ధన్యవాదాలు. నీ వాయిస్ విని నేను, రామ్ చరణ్ ఎంత థ్రిల్ అయ్యామో... ప్రేక్షకులందరూ అదే భావనకు లోనవుతారు' అని అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ, అడిగిన వెంటనే మహేశ్ బాబు ఒప్పుకున్నారని చెప్పారు. ఒకసారి స్క్రిప్ట్ చూడమని అడిగానని... దానికి సమాధానంగా... అవసరం లేదు చేసేద్దామని అన్నారని తెలిపారు. మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.

More Telugu News