TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక టోకెన్లు లేకుండానే సర్వదర్శనం

  • టోకెన్ల కౌంటర్ల వద్ద తోపులాట నేపథ్యంలో నిర్ణయం
  • చిన్న ఘటనను పెద్దగా చిత్రీకరించారన్న ఈవో ధర్మారెడ్డి
  • భక్తులను భగవంతుడికి దూరం చేస్తున్నామన్న ప్రచారంలో నిజం లేదని వ్యాఖ్య
TTD Said Good news to Lord Srivari Devotees

సర్వదర్శనం టోకెన్ల కోసం మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టోకెన్లు లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా సమయంలో రెండున్నర నెలలపాటు ఎస్ఎస్‌డీ టోకెన్లను ఆన్‌లైన్‌లో ఇచ్చామని, దీనివల్ల గ్రామీణ, కంప్యూటర్ పరిజ్ఞానం లేని భక్తులు నష్టపోతున్నారని గుర్తించామన్నారు. దీంతో మార్చి 1 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు టోకెన్ల విధానాన్ని చక్కగా నిర్వహించామన్నారు. 

టోకెన్ల కౌంటర్ల వద్ద తోపులాటపై మాట్లాడుతూ.. 9, 10, 11 తేదీల్లో రద్దీ నేపథ్యంలో 8వ తేదీనే మూడు రోజులకు సరిపడా టికెట్లు ఇచ్చామని, కాబట్టి కౌంటర్లు మూసేశామన్నారు. తిరిగి బుధ, గురు, శక్రవారాలకు గాను మంగళవారం లక్ష టోకెన్లు జారీ చేయాలని అనుకున్నామన్నారు. శనివారం టోకెన్లు దొరకనివారు తిరుపతిలోనే ఉండిపోయారని, ఆ తర్వాత నాలుగు రోజులు సెలవులు కావడంతో మరింత మంది భక్తులు వచ్చారని వివరించారు. 

ఈ నేపథ్యంలో టికెట్లు తీసుకుని బయటకి వచ్చే లైన్‌లోకి భక్తులు ప్రవేశించడంతో గందరగోళం తలెత్తిందన్నారు. సమస్యను అరగంటలోనే పరిష్కరించామన్నారు. భక్తులను భగవంతుడికి దూరం చేస్తున్నామన్న ప్రచారం సరికాదన్నారు. చిన్న ఘటనను పెద్దగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని, వ్యక్తిగతంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ ఇస్తున్నట్టు ధర్మారెడ్డి తెలిపారు.

More Telugu News