Mekathoti Sucharitha: అల‌క వీడిన సుచ‌రిత‌... జ‌గ‌న్‌తో మాజీ హోం మంత్రి భేటీ

  • మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌పై అల‌క‌
  • మోపిదేవి చ‌ర్చించినా మెత్త‌బ‌డ‌ని సుచ‌రిత‌
  • స‌జ్జ‌ల ఫోన్ చేసినా అందుబాటులోకి రాని మాజీ మంత్రి 
  • తాజాగా త‌న‌కు తానే సీఎం వ‌ద్ద‌కు వ‌చ్చిన సుచరిత  
ex minister mekathoti sucharitha meeting with ys jagan

ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ణ నేప‌థ్యంలో అల‌కబూనిన ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేక‌తోటి సుచ‌రిత ఎట్ట‌కేల‌కు అల‌క వీడారు. మూడు రోజులుగా పార్టీ నేత‌ల‌కు అందుబాటులో లేకుండా పోయిన ఆమె నేటి మ‌ధ్యాహ్నం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన సుచరిత‌తో సీఎం జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు. స్వ‌యంగా సీఎం వ‌ద్ద‌కు సుచరిత రావ‌డంతో ఆమె అల‌క వీడిన‌ట్టేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవస్థీక‌ర‌ణ‌లో భాగంగా 11 మంది పాత మంత్రుల‌ను కొన‌సాగించిన జ‌గ‌న్‌.. మేక‌తోటి సుచ‌రిత స‌హా 13 మందికి ఉద్వాస‌న పలికిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో జ‌గ‌న్ నిర్ణ‌యంపై అల‌కబూనిన సుచ‌రిత ఏకంగా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా స‌మ‌ర్పించారు. స్పీక‌ర్ ఫార్మాట్‌లోనే త‌మ త‌ల్లి రాజీనామా చేశార‌ని సుచరిత కుమార్తె ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

తొలుత ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ నేరుగా సుచ‌రిత వ‌ద్ద‌కు వెళ్లి మంత‌నాలు సాగించారు. అయినా కూడా సుచ‌రిత చ‌ల్ల‌బ‌డ‌లేదు. ఆ త‌ర్వాత పార్టీ కీల‌క నేత‌, ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఫోన్ చేసినా సుచ‌రిత అందుబాటులో లేకుండా పోయారు. ఈ క్ర‌మంలో ఆమెను చ‌ల్ల‌బ‌ర‌చ‌డం సాధ్యం కాదన్న వాద‌న‌లు వినిపించాయి. అయితే అంద‌రి ఊహాగానాల‌కు తెర‌దించుతూ స్వ‌యంగా సుచ‌రితే నేరుగా జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆయ‌న‌తో భేటీ కావ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News