Ideas2IT: 100 మంది ఉద్యోగులకు కార్లను బహూకరించిన చెన్నై ఐటీ సంస్థ

  • ఐడియాస్2ఐటీ అనే సంస్థ యాజమాన్యం ఔదార్యం
  • లాభాలను ఉద్యోగులకే పంచిన వైనం
  • మారుతి సుజుకి కార్లను అందజేసిన సంస్థ
Chennai IT firm Ideas2IT gifts cars to hundred employees

చెన్నైలోని ఓ ఐటీ సంస్థ తన ఉద్యోగుల కృషికి తగిన గుర్తింపునిచ్చింది. కంపెనీ ఎదుగుదలకు విశేషంగా తోడ్పాటు అందించిన ఉద్యోగులకు కార్లను బహూకరించింది. ఐడియాస్2ఐటీ అనే సాఫ్ట్ వేర్ సంస్థ చెన్నై వేదికగా కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. ఈ సంస్థలో 500 మంది పనిచేస్తున్నారు. కొంతకాలంగా కంపెనీ ఆశించిన మేర లాభాల బాటలో పయనిస్తోంది. 

అయితే ఆ సంస్థ యాజమాన్యం ఎంతో నిజాయతీగా, ఉద్యోగుల వల్లే తమ అభ్యున్నతి సాధ్యమైందని గుర్తించింది. సంస్థలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న 100 మంది ఉద్యోగుల సేవలకు మెచ్చి వారికి మారుతి సుజుకి కార్లను అందజేసింది. ఈ 100 మంది ఉద్యోగులు పదేళ్లకు పైగా తమ సంస్థ వెన్నంటే ఉన్నారని, కంపెనీకి వచ్చిన లాభాలను ఉద్యోగులకు కూడా పంచాలన్నదే తమ సిద్ధాంతం అని ఐడియాస్2ఐటీ సంస్థ మార్కెటింగ్ హెడ్ హరి సుబ్రమణియన్ వెల్లడించారు. 

కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మురళి వివేకానందన్ మాట్లాడుతూ, కంపెనీ అభివృద్ధి చెందడానికి ఉద్యోగులు ఎంతో శ్రమించారని తెలిపారు. "ఉద్యోగులకు మేం కార్లు ఇవ్వడం కాదు.. వారే తమ కృషితో కార్లను దక్కించుకున్నారు" అని వివరించారు. అటు, చెన్నైకి చెందిన కిస్ ఫ్లో అనే మరో సాఫ్ట్ వేర్ సంస్థ ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు ఒక్కొక్కటి రూ.1 కోటి విలువైన బీఎండబ్ల్యూ కార్లను కానుకగా ఇచ్చింది.

More Telugu News