Piyush Goyal: పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌రిచ్చిన నిరంజ‌న్ రెడ్డి

  • కేసీఆర్‌ది రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌న్న గోయ‌ల్‌
  • గోయ‌ల్ వ్యాఖ్య‌లు విన్నంత‌నే ఫైర్ అయిన నిరంజ‌న్ రెడ్డి
  • కేంద్రానిది వ్యాపారాత్మ‌క ధోర‌ణి అని ఆరోప‌ణ‌
niranjan reddy hits back on piyush goyal

యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ యాసంగిలో తెలంగాణ‌లో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ వాదిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ దిశ‌గా కేంద్రాన్ని ఒప్పించేందుకు సీఎం కేసీఆర్ మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. ఆ బృందానికి ఇప్ప‌టిదాకా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ గురువారం కేసీఆర్ స‌ర్కారుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. కేసీఆర్‌ది రైతు వ్య‌తిరేక ప్రభుత్వ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు.

పీయూష్ గోయల్ వ్యాఖ్య‌లు విన్నంత‌నే తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుప‌డ్డారు. పీయూష్ గోయల్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "కేంద్రానిది వ్యాపారాత్మ‌క ధోర‌ణి మాత్ర‌మే. ఉద్య‌మిస్తున్న రైతుల‌ను చంపి క్ష‌మాప‌ణ చెప్పారు. తెలంగాణ రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పే రోజు క‌చ్చితంగా వ‌స్తుంది. తెలంగాణ రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా మాట‌లు చెబుతారా? చిత్త‌శుద్ధి ఉంటే ప్ర‌ధాని స‌మ‌క్షంలో స‌మావేశం ఏర్పాటు చేయండి. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతు బంధు, నాణ్య‌మైన విద్యుత్ ఇస్తున్నందుకు రైతు వ్య‌తిరేకుల‌మా?" అంటూ నిరంజ‌న్ రెడ్డి విరుచుకుప‌డ్డారు.

More Telugu News