Harish Rao: ప్రతి గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం చేసి మోదీకి పంపించండి: హరీశ్ రావు

  • వడ్లు కొనబోమని మోదీ ప్రభుత్వం మొండికేస్తోంది
  • ఎఫ్సీఐ ద్వారా పంట కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉంది
  • రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందన్న హరీశ్ 
Harish Rao fires on Modi

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. ఎఫ్సీఐ ద్వారా పంటను కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉందని ఆయన అన్నారు. గతంలో ప్రధానులుగా చేసిన చాలా మంది వడ్లు కొనుగోలు చేశారని... మోదీ ప్రభుత్వం మాత్రం వడ్లు కొనబోమని మొండికేస్తోందని దుయ్యబట్టారు. 

పంజాబ్ లో వడ్లు కొంటున్నప్పుడు తెలంగాణలో కూడా కొనాలని ఢిల్లీలో మన ఎంపీలు కొట్లాడుతున్నారని... పంజాబ్ కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. సిద్ధిపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో వడ్లు కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని హరీశ్ చెప్పారు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని తెలిపారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని... బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఉచిత విద్యుత్ లేదని చెప్పారు. వడ్లు కొనుగోలు చేయాలని ప్రతి గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం చేసి మోదీకి పంపించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ప్రతి చోట చర్చ జరిగే విధంగా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పాల్గొనాలని చెప్పారు.

More Telugu News