Zahoor Mistry: పాకిస్థాన్ లో హత్యకు గురైన కాందహార్ విమాన హైజాకర్

  • 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్
  • ఖాట్మండు నుంచి లక్నో వెళుతున్న విమానం
  • దారిమళ్లించిన హైజాకర్లు
  • హైజాకర్లలో జహూర్ మిస్త్రీ ఒకడు
  • కరాచీలో స్థిరపడి పేరుమార్చుకున్న మిస్త్రీ
Kandahar plane hijacker Zahoor Mistry killed in Karachi

భారత్ కు చెందిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం 1999 డిసెంబరు 24న హైజాక్ కు గురికావడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి లక్నో వెళుతున్న ఈ విమానాన్ని ఉగ్రవాదులు దారిమళ్లించారు. తొలుత లాహోర్ విమానాశ్రయంలో ల్యాండైన ఆ విమానం అక్కడ ఇంధనం నింపుకుని, ఆపై దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగింది. అక్కడ్నించి ఆఫ్ఝనిస్థాన్ లోని కాందహార్ కు వెళ్లింది. 

నాడు హైజాక్ కు పాల్పడిన ముష్కరుల్లో జహూర్ మిస్త్రీ (జాహిద్ అఖుంద్) కూడా ఒకడు. కాగా, అతడు ఈ నెల 1న పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో హత్యకు గురైనట్టు వెల్లడైంది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు జహూర్ మిస్త్రీపై కాల్పులు జరిపారు. కరాచీ నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి. జహూర్ అంత్యక్రియలు కరాచీలోనే నిర్వహించగా, జైషే ఉగ్రవాద సంస్థ అగ్రనేతలు హాజరయ్యారు. 

కాందహార్ హైజాక్ ఘటన తర్వాత జహూర్ మిస్త్రీ... జాహిద్ అఖుంద్ పేరుతో పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో స్థిరపడి ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి హత్యను నిర్ధారించిన జియో టీవీ... ఓ వ్యాపారవేత్త హత్య అంటూ కథనం ప్రసారం చేసింది. జహూర్ మిస్త్రీని ఎవరు చంపారన్నది ఇంకా వెలుగులోకి రాలేదు.

More Telugu News