Prabhas: 'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్ కి ముహూర్తం ఖరారు!

  • రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధేశ్యామ్'
  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ రిలీజ్ 
  • కీలకమైన పాత్రలో భాగ్యశ్రీ 
  • ఈ నెల 11న ఐదు భాషల్లో విడుదల
Radhe Shyam movie update

ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా 'రాధే శ్యామ్' రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ప్రేమకథాకావ్యం ఇది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటి కరోనా పరిస్థితుల వలన వాయిదా వేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. 

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఇదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ ను వదులుతున్నారు. ఈ ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచే కసరత్తు జరుగుతోంది. 

ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ అందించాడు. ప్రతి పాట మరో ప్రపంచంలోకి తీసుకుని వెళుతుందని చెబుతుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్ తల్లిపాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ నటించారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో కృష్ణంరాజు .. జగపతిబాబు కనిపించనున్నారు.

More Telugu News