Cricket: రాహుల్ తో కనెక్ట్ కాలేకపోయా: విరాట్ కోహ్లీ

  • మొదట్లో టీ20 బ్యాటర్ లా కనిపించలేదు
  • ఆర్సీబీని వదిలెళ్లాక అతడిని నేను పట్టించుకోలేదు
  • ఆస్ట్రేలియా పర్యటనలో అతడి ఆత్మస్థైర్యం చూసి ముచ్చటేసిందన్న కోహ్లీ
Rahul Did Not Look Like T20 Batter Says Kohli

టీమిండియా వైఎస్ కెప్టెన్ కె.ఎల్. రాహుల్ తో మొదట తాను కనెక్ట్ కాలేకపోయానని మాజీ సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ నిర్వహించిన పాడ్ క్యాస్ట్ లో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. మొదట్లో టీ20 బ్యాటర్ లాగానే రాహుల్ కనిపించలేదని పేర్కొన్నాడు. ఐపీఎల్ లో రాహుల్ తొలిసారిగా 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండేళ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు. మళ్లీ 2016లో ఆర్సీబీ గూటికి వచ్చాడు. తర్వాత పంజాబ్ కు ఆడిన రాహుల్.. ఇప్పుడు లఖ్ నవూ సూపర్ జెయంట్స్ టీమ్ కు సారథిగా ఉన్నాడు. 

‘‘కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ తో కలిసి 2013 ఐపీఎల్ లో బెంగళూరు తరఫున రాహుల్ ఆడాడు. అప్పట్లో అతడు టీ20 బ్యాటర్ లా నాకు అస్సలు అనిపించలేదు. జట్టు నుంచి అతడు వెళ్లిపోయాక నేను అతడి గురించి పట్టించుకోలేదు’’ అని కోహ్లీ తెలిపాడు. కలిసి చాలా మ్యాచ్ లు ఆడినా పెద్దగా కనెక్ట్ కాలేకపోయానని చెప్పాడు. అప్పట్లో అతడు యువకుడిలా ఉండేవాడన్నాడు. 

అయితే, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అదరగొడుతున్నాడన్న విషయాన్ని జట్టు నుంచి వెళ్లిపోయాకే తెలుసుకున్నానని పేర్కొన్నాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంచి ఇన్నింగ్స్ ఆడాడని, ఆటపై దృష్టి పెట్టి రాటుదేలాడని చెప్పాడు. అప్పుడు రాహుల్ ఆత్మస్థైర్యం చూసి ముచ్చటేసిందని కోహ్లీ తెలిపాడు.

More Telugu News