Telangana: తెలంగాణలో ‘రికార్డులు’ సృష్టిస్తున్న మద్యం విక్రయాలు

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30వేల కోట్లు
  • జనవరి నాటికే రూ.25,000 కోట్ల విక్రయాలు
  • ఒక్క నెలలో రూ.2,270 కోట్ల మద్యం సరఫరా
Telangana May Touch All time High In Liquor Sales For Current Fiscal

తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు)లో కొత్త రికార్డును సృష్టించనున్నాయి. సుమారు రూ.30,000 కోట్ల మేర అమ్మకాలు నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో మద్యం విక్రయాలు ఎప్పుడూ నమోదు కాలేదు.

జనవరి నాటికి రాష్ట్రంలో రూ.25,000 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. కానీ, 2020-21 సంవత్సరం మొదటి 10 నెలల్లో విక్రయాలు రూ.22,000 కోట్లతో పోలిస్తే రూ.3,000 కోట్ల మేర అధికంగా నమోదైనట్టు తెలుస్తోంది. ప్రతి రోజు రూ.83 కోట్ల మేర మద్యం విక్రయమవుతుండగా, ప్రభుత్వానికి రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా 2,630 వైన్ షాపులు ఉన్నాయి. బార్లు, క్లబ్బులు, పర్యాటక హోటళ్లలో విక్రయ పాయింట్లు మరో 1,000 వరకు ఉన్నాయి. జనవరి నెలలో రూ.2,270 కోట్ల మద్యం సరఫరా అవగా, ఇందులో 28 లక్షల ఇండియన్ మేడ్ ఫారీన్ లిక్కర్ కేసులు, 23 లక్షల బీర్ కేసులు ఉన్నాయి. మరోవైపు అదనంగా మరో 400 వైన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం.

More Telugu News