COVID19: చిన్నారుల్లో పెరిగిన కరోనా కేసులు.. అమెరికాలో ఐదేళ్లలోపున్న పిల్లలపైనే ఎక్కువ ప్రభావం

  • డేటాను విడుదల చేసిన యూఎస్ సీడీసీ
  • లక్ష జనాభాలో నలుగురు పిల్లలకు కరోనా
  • 12 నుంచి 18 ఏళ్ల మధ్య చిన్నారులే సగం
  • 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న వారు 16%
Covid Cases In USA Raises In Children

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తోంది. అన్ని దేశాల్లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఎక్కువగా ఒమిక్రాన్ బాధితులే ఉంటున్నారు. అమెరికాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోజూ లక్షల కొద్దీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ సారి చిన్నారులూ ఎక్కువ మంది మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంటూ అమెరికా సీడీసీ డేటాను విడుదల చేసింది. 14 రాష్ట్రాల్లోని 250 ఆసుపత్రుల్లోని పేషెంట్ల ఆధారంగా వివరాలను వెల్లడించింది.

డిసెంబర్ మధ్య నుంచి ఒమిక్రాన్ వ్యాప్తి చాలా ఎక్కువైందని, లక్ష మంది చిన్నారుల్లో నలుగురు కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న 5 నుంచి 17 ఏళ్ల వారు లక్ష జనాభాలో ఒకరు ఉంటున్నారని పేర్కొంది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సందర్భంలో తీసుకున్నా.. ఎక్కువ మంది పిల్లలు ఆసుపత్రిపాలవుతున్న సందర్భం ఇదేనని సీడీసీ చీఫ్  డాక్టర్ రోచెల్ వాలెన్ స్కీ చెప్పారు. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల్లో 50 శాతం మంది 12 నుంచి 18 ఏళ్ల మధ్యవారని తెలిపారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వారు 16 శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరందరికీ ఫుల్ వ్యాక్సినేషన్ జరిగిందన్నారు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 30 కోట్ల మార్కును దాటాయి. ప్రజలకు నాలుగో బూస్టర్ డోస్ అవసరం లేదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడో డోసు తీసుకున్న మూడు నెలల తర్వాత కూడా 65 ఏళ్లపైబడిన వాళ్లలో 90 శాతం రక్షణ ఉందని బ్రిటన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

More Telugu News