Vikarabad District: రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ ఎస్సై దుర్మరణం.. వారం రోజుల క్రితమే వివాహం

  • ఒడిబియ్యం కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
  • ఆటోను బలంగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
  • ప్రమాదంలో ఆయన తండ్రి కూడా మృతి
Vikarabad SI Srinu Naik died in Road Accident

వారం రోజుల క్రితం వివాహం చేసుకున్న వికారాబాద్ ఎస్సై ఒడిబియ్యం కార్యక్రమం కోసం స్వగ్రామానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు చెందిన శ్రీను నాయక్ (30) వికారాబాద్ వన్‌టౌన్ ఎస్సైగా పనిచేస్తున్నారు. గత నెల 20న వివాహం చేసుకున్నారు. ఒడిబియ్యం కార్యక్రమం ఉండడంతో తండ్రి మాన్యానాయక్ (55)ను తీసుకుని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన మాడుగుల మండలం మాన్యానాయక్ తండా చేరుకున్నారు.

కార్యక్రమం పూర్తయిన అనంతరం నిన్న తండ్రితో కలిసి తిరిగి హైదరాబాద్‌కు ఆటోలో బయలుదేరారు. చింతపల్లి మండలం పోలెపల్లి రాంనగర్ వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News