India: 8 వ్యాక్సిన్లు, 4 చికిత్స విధానాలు... భారత్ లో కొవిడ్ పై అస్త్రాలు ఇవే!

  • భారత్ లో కరోనా తీవ్రస్థాయిలో ప్రభావం
  • అయినప్పటికీ తట్టుకున్న భారత్
  • ముమ్మరంగా వ్యాక్సినేషన్
  • సమర్థ చికిత్స విధానాలతో త్వరితగతిన కోలుకున్న దేశం
India fights corona with the help of vaccines and treatment methods

కరోనా మహమ్మారి ప్రభావాన్ని తీవ్రస్థాయిలో చవిచూసిన దేశాల్లో భారత్ ఒకటి. అయితే త్వరితగతిన కోలుకున్న దేశాల్లోనూ భారత్ ముందంజలో నిలిచింది. సకాలంలో వ్యాక్సినేషన్ భారత్ లో మరిన్ని వేవ్ లు తలెత్తకుండా నిలువరించిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన చికిత్స విధానాలు పక్కాగా అమలు చేయడం కూడా ప్రాణనష్టం మరింత పెరగకుండా నివారించింది.

కాగా, భారత్ లో తాజాగా మరో రెండు కరోనా వ్యాక్సిన్లకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) ఆమోదం తెలిపింది. దాంతో భారత్ లో అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ల సంఖ్య 8కి పెరిగింది. అదే సమయంలో దేశంలో 4 రకాల వైద్య విధానాలు అమలు చేస్తున్నారు.

1.కొవిషీల్డ్...
బ్రిటీష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయి. కొవిషీల్డ్ పేరుతో ఈ వ్యాక్సిన్ ను సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారత్ లో ఉత్పత్తి చేస్తోంది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్. మానవ కణాల్లోకి చొచ్చుకుని వెళ్లి ఇన్ఫెక్షన్ కలిగించేందుకు కరోనా వైరస్ కు స్పైక్ ప్రొటీన్ సాయపడుతుంది. ఈ స్పైక్ ప్రొటీన్ ను దెబ్బతీసేందుకు చింపాంజీలకు సోకే అడెనో వైరస్ లను ఈ వ్యాక్సిన్ లో ఉపయోగించారు.

2.కొవాగ్జిన్...
ఇది దేశీయంగా తయారైన రెండు డోసుల వ్యాక్సిన్. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసింది. కరోనా వైరస్ కణాలు పునరుత్పత్తి చేయలేని విధంగా వాటిని రసాయనాల ప్రభావానికి గురిచేస్తారు. ఆ విధంగా కరోనా మృత కణాలను రూపొందించి వాటితో ఈ వ్యాక్సిన్ ను తయారుచేశారు.

3.స్పుత్నిక్ వి...
ఈ వ్యాక్సిన్ ను రష్యాలోని గమలేయా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ రూపొందించింది. ఇందులో ఏడీ5, ఏడీ26 అనే రెండు అడెనోవైరస్ లను ఉపయోగించి వ్యాక్సిన్ తయారుచేశారు. అడెనోవైరస్ లు సాధారణ జలుబుకు కలిగించే వైరస్ లు అని తెలిసిందే. కరోనా వైరస్ సోకినప్పుడు కూడా జలుబు చేస్తుంటుంది. అందుకే, కరోనాను తలపించే అడెనోవైరస్ లను శరీరంలో ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని ప్రేరేపిస్తారు. ఈ సూత్రం ఆధారంగానే స్పుత్నిక్ వి అభివృద్ధి చేశారు.

4.జైకోవ్ డి...
జైకోవ్ డి డీఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్. అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా ఈ వ్యాక్సిన్ ను రూపొందించింది. ఇది ఇతర వ్యాక్సిన్లకు భిన్నంగా మూడు డోసుల వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు సూది ఉండే ఇంజెక్షన్ అవసరంలేదు. జన్యుపరంగా మార్పులకు గురిచేసిన వైరస్ జన్యువుల నకళ్లను చిన్న అణువులుగా విభజించి ఇంజెక్షన్ ద్వారా వ్యాక్సిన్ రూపంలో మానవులకు అందిస్తారు.

5.మోడెర్నా...
అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ ఆర్ఎన్ఏ) జెనెటిక్ కోడ్ ఆధారంగా తయారైన రెండు డోసుల వ్యాక్సిన్ ఇది. ఆ వ్యాక్సిన్ మానవ దేహంలోకి ప్రవేశించగానే వైరల్ ప్రొటీన్ ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో కరోనా సోకితే, వ్యాధి కారక కణాల ప్రొటీన్ పై దాడి చేయడం ఎలాగో వ్యాధినిరోధక కణాలకు ముందస్తు శిక్షణ ఇస్తుంది. అనేక వైరస్ లలో ఆర్ఎన్ఏ ఓ జన్యుపదార్థంగా ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ సాధారణంగా కణాల్లో ప్రొటీన్ల తయారీకి ఉపయోగపడుతుంది.

6.జాన్సన్ అండ్ జాన్సన్...
ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. దీన్ని అమెరికా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసింది. మార్పులకు గురైన వైరస్ లోని కొంత భాగం ఈ వ్యాక్సిన్ లో ఉంటుంది. అయితే ఇది కొవిడ్ ను కలిగించే వైరస్ కాదు. ఇది కేవలం వాహక వైరస్ మాత్రమే. తనంతట తాను పునరుత్పత్తి జరుపుకోలేదు కాబట్టి ఇది నిరపాయకరమైనది. ఈ వాహక వైరస్ మానవ దేహంలోని కణాలు వ్యాధి నిరోధక శక్తిని సంతరించుకునేలా ప్రేరేపిస్తుంది.

7.కోర్బెవాక్స్...
హైదరాబాదుకు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ కోర్బెవాక్స్ సృష్టికర్త. సార్స్ కోవ్-2 స్పైక్ ప్రొటీన్ కు చెందిన రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్బీడీ) నమూనాను ఈ వ్యాక్సిన్ కలిగి ఉంటుంది. ఈ రెండు డోసుల వ్యాక్సిన్ ను కండరాల్లోకి సూది ద్వారా ఎక్కిస్తారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్లు ఏ సూత్రం ఆధారంగా తయారుచేశారో కోర్బెవాక్స్ కూడా అదే రీతిలో అభివృద్ధి చేశారు.

8.కోవావాక్స్...
అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ నోవావాక్స్ ఈ కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. నోవావాక్స్ నుంచి వ్యాక్సిన్ సాంకేతిక లైసెన్స్ పొందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని కొవావాక్స్ పేరిట దేశీయంగా ఉత్పత్తి చేస్తోంది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్. ఇందులో శుద్ధిచేయబడిన వైరస్ భాగాలు వినియోగించారు. వ్యాక్సిన్ ద్వారా ఇవి మానవ దేహంలోకి ప్రవేశించి వ్యాధి నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి.

చికిత్స విధానాలు...
కరోనా వైరస్ చికిత్సా విధానం ప్రధానంగా ఓ ఔషధాన్ని ఆధారంగా చేసుకుని సాగుతుంది. ఈ విధంగా చూస్తే నాలుగు ఔషధాలను భారత్ లో కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్నారు.

1.మోల్నుపిరావిర్...
అమెరికా ఫార్మా కంపెనీ మెర్క్ దీన్ని తయారుచేస్తోంది. ఇది యాంటీవైరల్ ఔషధం. శరీరంలో వైరస్ ల పునరుత్పత్తిని అడ్డుకుంటుంది. మోల్నుపిరావిర్ ఔషధాన్ని భారత్ లో 13 కంపెనీలు తయారుచేస్తున్నాయి. కొవిడ్ బారిన పడిన పెద్దవాళ్లలో తీవ్ర పరిస్థితులు తలెత్తినప్పుడు అత్యవసర ఔషధంగా దీన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వ పరంగా దీనికి అనుమతులు ఉన్నాయి.

2.టోసిలిజుమాబ్...
స్విట్జర్లాండ్ ఫార్మా దిగ్గజం రోచే ఈ మందును తయారుచేసింది. సాధారణంగా టోసిలిజుమాబ్ ఔషధాన్ని రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ బాధితులకు వాడుతుంటారు. వ్యాధి నిరోధక శక్తి అదుపుతప్పిన సమయాల్లో ఇది సమర్థంగా పనిచేస్తుంది. కొన్నిసార్లు సొంత ఇమ్యూనిటీయే మానవదేహానికి హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు టోసిలిజుమాబ్ సాయంతో వ్యాధినిరోధక శక్తిని నియంత్రించే వీలుంటుంది. కొవిడ్ బారినపడిన వాళ్లలో కరోనా కణాలుగా పొరబడి ఊపిరితిత్తుల కణజాలంపై వ్యాధినిరోధక శక్తి దాడి చేస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటి కేసుల్లో టోసిలిజుమాబ్ ఉపయుక్తంగా ఉంటోంది. భారత్ లో దీన్ని సిప్లా సంస్థ ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తోంది.

3.డీ ఆక్సీ డీ గ్లూకోజ్ (2 డీజీ)...
భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఈ డీ ఆక్సీ డీ గ్లూకోజ్ (2 డీజీ) ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇది నోటి ద్వారా తీసుకునే మందు. ఇది డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ పైనే లభిస్తుంది. వైరస్ ప్రధానంగా శక్తి కోసం గ్లైకోలిసిస్ లేక గ్లూకోజ్ విచ్ఛిన్నంపై ఆధారపడుతుంది. అయితే 2 డీజీ... గ్లైకోలిసిస్ ను అడ్డుకోవడం ద్వారా వైరస్ అభివృద్ధిని నిలువరిస్తుంది.

4. రెజిన్ కోవ్-2...
దీన్ని యాంటీబాడీ కాక్ టెయిల్ గా పిలుస్తారు. ఇది కొన్ని ఔషధాల మిశ్రమం. స్విస్ ఫార్మా సంస్థ రోచే దీని సృష్టికర్త. మోనోక్లోనల్ యాంటీబాడీలు కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ ల కాంబినేషన్ తో ఈ కాక్ టెయిల్ తయారుచేశారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. మోనోక్లోనల్ యాంటీబాడీలు నిజమైనవి కావు. ఇవి ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేసిన యాంటీబాడీలు. నిజమైన యాంటీబాడీల తరహాలోనే శరీరంలో వ్యాధినిరోధక శక్తిని ప్రోత్సహిస్తాయి. కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ ప్రత్యేకంగా స్పైక్ ప్రొటీన్ ను నాశనం చేసేందుకు ఉద్దేశించినవి.

More Telugu News