GVL Narasimha Rao: తెలుగు రాష్ట్రాలకు మేం ఎంత ఇస్తున్నామో చూడండి: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • కాంగ్రెస్ సర్కారుతో పోల్చిన జీవీఎల్
  • 2013-14లో ఉమ్మడి ఏపీకి రూ.40 వేల కోట్లు వచ్చాయని వెల్లడి
  • 2020-21లో రూ.1.40 లక్షల కోట్లు ఇచ్చామని వివరణ
  • ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన జీవీఎల్
GVL shares centres allocations to Telugu States

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నాటి కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన నిధులను, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన నిధులను పోల్చుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వివరాలు వెల్లడించారు. 2013-14లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు రూ.40,123 కోట్లు ఇచ్చిందని తెలిపారు. 2020-21లో ఒక్క ఆంధ్రప్రదేశ్ కే ఎన్డీయే సర్కారు రూ.77,538 కోట్లు ఇచ్చిందని వివరించారు.

తెలంగాణకు రూ.62,875 కోట్లు ఇచ్చిందని, మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ఎన్డీయే సర్కారు రూ.1,40,413 కోట్లు ఇచ్చిందని వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే ఇది 350 శాతం పెరుగుదల అని పేర్కొన్నారు. అందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. అంతేకాదు, 2009 నుంచి 2021 వరకు ఆయా కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రుణాలు, ముందస్తు చెల్లింపుల గణాంకాలను కూడా జీవీఎల్ పంచుకున్నారు.

More Telugu News