Sukhesh Chandrasekhar: ఆర్థిక నేరగాడు సుఖేశ్ ను జైలులో కలిసిన 12 మంది బాలీవుడ్ భామలు, మోడల్స్...?

  • రాన్ బాక్సీ ప్రమోటర్లకు బెయిల్ ఇప్పిస్తానంటూ టోకరా
  • మల్వీందర్, శివీందర్ ల భార్యల నుంచి రూ.200 కోట్లు వసూలు
  • ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్
Bollywood divas and models reportedly met Sukhesh in Tihar Jail

రాన్ బాక్సీ ప్రమోటర్లు శివీందర్ సింగ్, మల్వీందర్ సింగ్ లకు బెయిల్ ఇప్పిస్తానంటూ వారి భార్యల నుంచి రూ.200 కోట్లు రాబట్టిన ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఖరీదైన కార్లు బహూకరించాడన్న వార్తలతో సుఖేశ్ కు మరింత ప్రాచుర్యం లభించడం తెలిసిందే. తాజాగా ఈడీ దర్యాప్తులో సుఖేశ్ గురించి సంచలన విషయాలు వెల్లడైనట్టు కథనాలు వచ్చాయి.

తీహార్ జైల్లో సుఖేశ్ ను కలిసేందుకు 12 మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు, మోడల్ భామలు తరలివచ్చారట. వారిలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి కూడా ఉన్నట్టు సమాచారం.

అంతకంటే సంచలన విషయం ఏమిటంటే.... జైల్లో తనకు నచ్చినట్టుగా గడిపేందుకు సుఖేశ్ జైలు అధికారులకు నెలకు రూ.1 కోటి రూపాయలు లంచంగా ముట్టచెప్పాడట. జైల్లోని తన గదిలో విలాసవంతమైన సదుపాయాలు, మొబైల్ ఫోన్ కోసం జైలు సిబ్బందిని మచ్చిక చేసుకుని వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, జైల్లో తనను డబుల్ లాక్ సెల్ లో వేశారని, తనను వేధిస్తున్నారని సుఖేశ్ జైలు అధికారులపై ఉన్నతాధికారులకు లేఖ రాశాడు.

More Telugu News