Women: యూకే నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్.. మనకు కూడా ఒమిక్రాన్ ముప్పు ఉందన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్!

  • బాధిత మహిళకు టిమ్స్ లో వైద్యం
  • ఆమె శాంపిల్స్ జెనెటిక్ సీక్వెన్సింగ్ కు పంపించామన్న హెల్త్ డైరెక్టర్
  • ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని వ్యాఖ్య
Women came from UK tests Corona positive

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ పలు దేశాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ భయాలు హైదరాబాదుకు కూడా పాకాయి. యూకే నుంచి హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన 35 ఏళ్ల ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎయిర్ పోర్టులో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ వివరాలను తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆమెను హైదరాబాదులోని టిమ్స్ కు పంపించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పారు. ఆమె శాంపిల్స్ ని జెనెటిక్ సీక్వెన్సింగ్ కు పంపించామని తెలిపారు. అయితే, అది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అనే విషయానికి సంబంధించి మూడు రోజుల్లో రిపోర్ట్ రానుంది.

బాధితురాలిని మెడికల్ అబ్జర్వేషన్ లో ఉంచామని శ్రీనివాసరావు చెప్పారు. ఆమె రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. అయితే ఆమె బంధువుకు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ అని తేలిందని చెప్పారు. మనకు కూడా ఒమిక్రాన్ ముప్పు ఉందని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కొత్త వేరియంట్ పై మూడు గంటల సేపు చర్చించామని తెలిపారు.
 
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే 24 దేశాలకు వ్యాప్తి చెందిందని చెప్పారు. దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరగలేదని.. అందుకే  కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్టు నిపుణులు చెపుతున్నారని అన్నారు.
 
అందరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా మాస్కు ధరించాలని... లేకపోతే మన నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒమిక్రాన్ బారిన పడిన రిస్క్ దేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన 239 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన మహిళ వచ్చిన యూకే కూడా రిస్క్ దేశాల జాబితాలో ఉంది.

More Telugu News