Ashish Mishra: లఖింపూర్ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి నోటీసులు

  • లఖింపూర్ లో రైతుల మృతి
  • రైతులపైకి కారును పోనిచ్చాడంటూ ఆశిష్ మిశ్రాపై ఆరోపణలు
  • ఈ కేసులో అరెస్టులు ఏవంటూ సీజేఐ తీవ్ర ఆగ్రహం
  • అనుమానితులను ప్రశ్నిస్తున్నామన్న యూపీ పోలీసులు
Uttar Pradesh police summoned Ashish Mishra

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో రైతుల పైకి కారుతో దూసుకుపోయిన కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు స్పందించారు.

రైతుల మృతికి కారకుడంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు ఎట్టకేలకు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. లఖింపూర్ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని లక్నో ఐజీ లక్ష్మీ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నామని తెలిపారు.

కాగా, ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను యూపీ పోలీసులు షాజహాన్ పూర్ వద్ద అడ్డుకున్నారు. సిద్ధూ ఇద్దరు పంజాబ్ మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలతో కలిసి లఖింపూర్ వెళుతుండగా, పోలీసులు వారి వాహనాలను నిలిపివేశారు.

More Telugu News