YS Sharmila: కేటీఆర్ మంత్రి కావడం మన ఖర్మ.. చిన్నారికి న్యాయం కోసం దీక్షకు కూర్చుంటున్నా: వైఎస్ షర్మిల

  • హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల
  • బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్
  • రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి, మందుకు అడ్డాగా మార్చారు
Its our bad fate to have minister like KTR says YS Sharmila

హైదరాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబసభ్యులను వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని ఇంతవరకు పోలీసులు పట్టుకోకపోవడం దారుణమని అన్నారు.

బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దారుణానికి పాల్పడినవాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ పెంపుడు కుక్క చనిపోతే ఒక అధికారిపై చర్యలు తీసుకున్నారని... బయట చిన్నారులు చనిపోతుంటే కేసీఆర్ కు పట్టదా? అని ప్రశ్నించారు.

చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంపై షర్మిల మండిపడ్డారు. కనీస సమాచారం కూడా లేకుండానే ట్వీట్ చేసి సమాజాన్ని కేటీఆర్ తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కేటీఆర్ మంత్రి కావడం మన ఖర్మ అని చెప్పారు.

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్నప్పటికీ... ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ సరిగ్గా స్పందించడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి, మందుకు అడ్డాగా మార్చారని అన్నారు. చిన్నారి చైత్రకు న్యాయం జరిగేంత వరకు తాను దీక్షను చేపట్టబోతున్నానని తెలిపారు. బాధిత కుటుంబం ఎదుటే ఆమె దీక్షకు కూర్చున్నారు.

More Telugu News