Supreme Court: ఢిల్లీలోనే సుప్రీంకోర్టు ఉండటం అన్యాయం: మద్రాస్ హైకోర్టు జడ్జి

  • దేశరాజధానిలో లేని వారికి అత్యున్నత న్యాయం అందడంలేదన్న జడ్జి
  • స్థానిక బెంచ్‌లు ఏర్పాటు చేయాలని సూచన
  • పదవీ విరమణ సభలో కీలక వ్యాఖ్యలు చేసిన జస్టిస్ కిరుబకరన్
  • గురువారం నాడు హైకోర్టులో జరిగిన సభ
It is unfair for the Supreme Court to be in Delhi Madras High Court judge

సుప్రీంకోర్టు దేశరాజధానిలోనే ఉండటం ఢిల్లీ పరిసరాల్లో లేని వారికి అన్యాయమని మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ కిరుబకరన్ అన్నారు. శుక్రవారం నాటితో ఆయన పదవీకాలం ముగిసింది. మొహరం కారణంగా ఆరోజు సెలవు కావడంతో గురువారం నాడు హైకోర్టు ప్రాంగణంలో ఆయన పదవీ విరమణ సభ జరిగింది.

ఈ సభలో జస్టిస్ కిరుబకరన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కేవలం ఢిల్లీలోనే ఉండటం ఇతర ప్రాంతాల్లోని ప్రజలకు అన్యాయమని, కాబట్టి సుప్రీంకోర్టు కొన్ని స్థానిక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానానికి సూచన చేశారు. ఈ ఆలోచనను సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ విభాగం తిరస్కరించినట్లు తెలిసిందని, ఈ విషయంలో సుప్రీంకోర్టు మరోసారి పునరాలోచించాలని ఆయన కోరారు. న్యాయవ్యవస్థలో ఢిల్లీ, బాంబే శక్తిమంతమైన కేంద్రాలుగా ఉన్నాయని, ఈ రెండు కోర్టులంత బలంగా సుప్రీంకోర్టును మిగతా రాష్ట్రాలు రిప్రజెంట్ చేయడం లేదని జస్టిస్ కిరుబకరన్ అభిప్రాయపడ్డారు.

ఒకవేళ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోకపోతే, కేంద్ర ప్రభుత్వం దీనికోసం రాజ్యాంగానికి సవరణ చేయాలని ఆయన కోరారు. 2009 మార్చి 31న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కిరుబకరన్.. 2011లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. జె. దీపా, జె. దీపక్‌ను తమిళనాడు మాజీ సీఎం జె. జయలలిత వారసులుగా ప్రకటించడం వంటి కీలక కేసుల్లో ఆయన తీర్పు వెలువరించారు. టూ వీలర్ వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయడం వంటి తీర్పులిచ్చారు.

‘‘నా వరకు నేను చేయగలిగిన న్యాయం చేశా. కానీ ఇది సంపూర్ణం కాదు. తాస్మాక్ (టీఏఎస్ఎమ్ఏసీ) షాపులు మూసివేయడం వంటి కొన్ని విషయాల్లో నేను విఫలమయ్యా’’ అని జస్టిస్ కిరుబకరన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని, లిక్కర్ షాపులను కనీసం పాక్షికంగా అయినా మూసివేయాలని ఆయన కోరారు. ఇలాగైనా భవిష్యత్తులో జాతిపిత కలను సాకారం చేయగలుగుతామని పేర్కొన్నారు.

More Telugu News