Ongole: భర్త హత్య విషయాన్ని పోలీసులు చెప్పగానే... గదిలోకి వెళ్లి భార్య ఆత్మహత్య!

  • ఒంగోలులో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు, శ్రీవల్లి
  • నిన్న టంగుటూరు వద్ద నాగరాజు హత్య
  • విచారణకు రావాలని పిలవగానే ఉరేసుకున్న శ్రీవల్లి
Wife Commits Sucide after Husbend Murder

ప్రేమించి పెళ్లాడిన భర్త, దూరమై ఒంటరిగా ఉంటున్న ఓ యువతి, తన భర్త హత్యకు గురి కావడం, పోలీసులు తనను విచారణకు పిలవడంతో, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి, ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే...

ఒంగోలుకు చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు (26), ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఎడుగుండ్లపాడుకు చెందిన యువతి శ్రీవల్లి (21), మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంట ఒంగోలులోని హిల్ కాలనీలోని ఓ ఇంట్లో నివాసం ఉంటుండగా, వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో శ్రీవల్లి నాగరాజుపై గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆపై విభేదాలు తలెత్తడంతో, నాగరాజు, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోగా, శ్రీవల్లి మాత్రం తాము తీసుకున్న అద్దె ఇంట్లోనే ఉంటోంది.

ఈ క్రమంలో నిన్న ఉదయం టంగుటూరుకు సమీపంలోని మర్లపాడు వద్ద చెరువులో నాగరాజు మృతదేహం లభించింది. పోలీసులు శ్రీవల్లికి ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఆమెను ఆసుపత్రిలో చూపించేందుకు తల్లి రమాదేవి కూడా ఒంగోలులో ఉన్నారు.

కేసు విచారణలో భాగంగా వీరిద్దరినీ విచారించాలని భావించిన సింగరాయకొండ పోలీసులు, శ్రీవల్లిని స్టేషన్ కు రావాలని కోరారు. ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకుని వస్తానని చెప్పి, లోపలికి వెళ్లిన ఆమె, ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శ్రీవల్లి కనిపించింది. దీంతో పోలీసులు ఆమె ఆత్మహత్యపైనా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

More Telugu News