YS Vijayamma: రాజన్న బిడ్డ మీ ముందుకు వచ్చింది... మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ

  • ఖమ్మం జిల్లాలో షర్మిల పార్టీ సంకల్ప సభ
  • హాజరైన వైఎస్ విజయమ్మ
  • తండ్రి అడుగుజాడల్లో షర్మిల తెలంగాణకు వచ్చిందని వెల్లడి
  • నాడు ఏప్రిల్ 9న చేవెళ్లలో పాదయాత్ర షురూ చేశారని వివరణ
  • ఇప్పుడదే రోజున షర్మిల పార్టీ స్థాపిస్తోందని వ్యాఖ్యలు
YS Vijayamma speech in Khammam

ఖమ్మంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, 18 ఏళ్ల కిందట ఏప్రిల్ 9న వైఎస్సార్ చేవెళ్ల నుంచే పాదయాత్ర చేసి విజయవంతం అయ్యారని వెల్లడించారు. ఇప్పుడదే రోజున  తన తండ్రి అడుగుజాడల్లో ఖమ్మం జిల్లా గుమ్మం నుంచే తన రాజకీయ తొలి అడుగులు వేసేందుకు షర్మిల మీ ముందుకు వచ్చింది అని పేర్కొన్నారు. రాజన్న బిడ్డ కొత్త పార్టీ పెడుతుందని తెలియగానే, మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ప్రసంగించారు.

"మాకు ఈ గడ్డతో సంబంధం తెగిపోలేదని చెప్పడానికే వచ్చాను. రాజశేఖర్ రెడ్డి గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజశేఖర్ రెడ్డిని నాయకుడిగా నిలబెట్టిన ప్రాంతం తెలంగాణ. అందుకే మా కుటుంబం మీకెప్పుడూ రుణపడి ఉంటుంది. నాడు రాజశేఖర్ రెడ్డి మిస్సింగ్ అంటూ వార్తలు రాగానే 700 వరకు గుండెలు ఆగిపోయాయి. రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికీ మీ హృదయాల్లో ఉంచుకున్నందుకు ఈ జన్మంతా మీకు రుణగ్రస్తులమై ఉంటాం. షర్మిలమ్మ ప్రతి యాత్రలోనూ మీరు అక్కున చేర్చుకుంటున్నారు. తెలంగాణతో నా జీవితం ముడిపడి ఉందమ్మా అని షర్మిలమ్మ చెప్పగానే ఎంతో సంతోషించాను. ఈ గడ్డతో మా అనుబంధం 40 ఏళ్లది. ఇప్పుడు షర్మిలమ్మ కారణంగా ఆ బంధం మరింత ముందుకు సాగనుంది" అంటూ పేర్కొన్నారు.

More Telugu News