Nara Lokesh: ఐటీ మంత్రిగా 35 వేల ఉద్యోగాలు తీసుకొచ్చా... మీరేం తెచ్చారు?: తిరుపతి ఎన్నికల ప్రచారంలో లోకేశ్

  • తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక
  • టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ
  • తిరుపతి కార్పొరేషన్ కూడలిలో లోకేశ్ ప్రసంగం
  • తిరుపతికి ఎన్నో పరిశ్రమలు తెచ్చామని వెల్లడి
Nara Lokesh campaigns for Panabaka Lakshmi in Tirupati

తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక బరిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున నారా లోకేశ్ ప్రచారం చేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కూడలిలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కుడిచేత్తో రూ.10 ఇచ్చి, ఎడమచేత్తో రూ.100 లాగేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తాను ఐటీ మంత్రిగా వ్యవహరించిన సమయంలో 35 వేల ఉద్యోగాలు తీసుకువచ్చానని లోకేశ్ వెల్లడించారు. తిరుపతిలో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ముందుకెళ్లడంలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో తిరుపతికి ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చామని అన్నారు.

అంతకుముందు, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. పోలి గ్రామానికి చెందిన డాక్టర్ ఎం.జనార్దన్ తో పాటు కొందరు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీడీపీ కండువాలు కప్పిన లోకేశ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడే వారికి టీడీపీలో సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు.

More Telugu News