Permit: ఇకపై వన్ నేషన్... వన్ పర్మిట్!

  • దేశవ్యాప్తంగా తిరిగేందుకు వీలుగా టూరిస్టు పర్మిట్లు
  • ఇతర రాష్ట్రాల్లో పన్ను చెల్లించడం నుంచి ఉపశమనం
  • ఏడాదికి ఒక్కసారి రుసుం చెల్లించేలా నూతన విధానం
  • ఏప్రిల్ 1 నుంచి అమలు
New permit system in country

వివాహాలు, ఇతర వేడుకలు, యాత్రలకు వెళ్లే వాహనాలకు రవాణా శాఖ ఇప్పటివరకు టూరిస్టు పర్మిట్లు ఇచ్చేది. రాష్ట్ర, అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుకునే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్లు ఇచ్చేవారు. ఈ విధానం ప్రకారం సదరు వాహనాలు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశించినప్పుడల్లా పన్నులు చెల్లించాల్సి వచ్చేది.

తాజాగా కేంద్రం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడికక్కడ పన్నులు చెల్లించే అవసరం లేకుండా కొత్తగా వన్ నేషన్, వన్ పర్మిట్ విధానం తీసుకొచ్చింది. ఈ మేరకు వాహనాలకు టూరిస్టు పర్మిట్లు జారీ చేయనున్నారు.

దీని ప్రకారం క్యాబ్ లు, ట్రావెల్స్ బస్సులు దేశవ్యాప్తంగా ఎక్కడ్నించి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఒక్కసారి రుసుం చెల్లిస్తే ఏడాది పాటు తిరిగే వెసులుబాటు కలుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఇప్పటివరకు కాంట్రాక్టు క్యారియర్లుగా తిరుగుతూ ప్రభుత్వానికి అధికమొత్తంలో చెల్లిస్తున్నాయని, ఇకపై టూరిస్టు పర్మిట్లతో ఇవి తక్కువ మొత్తం చెల్లిస్తూ దేశమంతా తిరుగుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం ఆర్టీసీకి నష్టదాయకం అని భావిస్తున్నారు.

More Telugu News