Narendra Modi: భార‌త్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేష‌న్ కార్య‌క్రమం: మోదీ

  • మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన మోదీ
  • గ‌త ఏడాది మార్చిలో జనతా కర్ఫ్యూను చేపట్టాం
  • భారతీయులు క‌న‌బ‌ర్చిన‌ క్రమశిక్షణ అద్భుతం
  • దాన్ని భవిష్యత్‌ తరాలు గుర్తు పెట్టుకుంటాయి
  • మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు
modi praises indias vaccination program

ప్ర‌పంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేష‌న్‌ కార్యక్రమం భార‌త్‌లో కొన‌సాగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చెప్పారు. మ‌న్ కీ బాత్‌లో ఆయ‌న మాట్లాడుతూ... ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జౌన్‌పూర్‌లో 109 ఏళ్ల వృద్ధురాలు వ్యాక్సిన్‌ తీసుకున్నారని, ఢిల్లీలో 107 ఏళ్ల వృద్ధురాలు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు.  

దేశ ప్ర‌జ‌ల్లో వారు స్ఫూర్తిని నింపార‌ని చెప్పారు. గ‌త ఏడాది మార్చిలో కరోనాను కట్టడి చేసేందుకు భార‌త్‌లో జనతా కర్ఫ్యూను చేపట్టామ‌ని, అందులో భారతీయులు క‌న‌బ‌ర్చిన‌ క్రమశిక్షణ ప్రపంచానికి ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. దాన్ని భవిష్యత్‌ తరాలు గుర్తు పెట్టుకుంటాయని చెప్పారు.

మ‌న్ కీ బాత్‌ 75 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని మోదీ తెలిపారు. అలాగే, స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 వసంతాలు పూర్తి కానున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో ‘అమృత్‌ మహోత్సవ్’ కార్యక్రమాన్ని చేప‌డుతున్నామ‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మ‌న‌ అపారమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తూనే, కొత్త తరానికి అవి చేరుకోవడానికి మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ‌ మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతో పాటు ఇతర అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారని మోదీ తెలిపారు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్‌ ప్రపంచ కప్‌లో భారత్‌ ఉన్నత స్థానం సాధించిందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌ మిథాలీరాజ్‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు.

అలాగే, బ్యాడ్మింటన్‌ స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నీలో రజత పతకం సాధించిన పీవీ సింధుకు అభినందనలు చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తోన్న సామాజిక కార్య‌క‌ర్త‌ల‌ను, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌ను ఆయ‌న అభినందించారు.

More Telugu News