Supreme Court: 'నోటా'పై కేంద్ర ప్రభుత్వం, ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

  • అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడితే ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్
  • పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత అశ్వినీ కుమార్
  • నోటాను ఓటుగా గుర్తించాలని విన్నపం
Supreme Court issues notives to Center and EC on NOTA

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే నోటా (పైన ఎవరూ కాదు)కు ఓటు వేసే వీలున్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో పోటీ చేసిన అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడుతుండటాన్ని కూడా గమనించే ఉంటాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నోటాకు 99 శాతం ఓట్లు పడినా, ఒక్క శాతం ఓట్లతో మెజారిటీ సాధించిన అభ్యర్థి విజయం సాధించే వీలు ఉంది.

ఈ నేపథ్యంలో, ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. నోటాకు అత్యధిక ఓట్లు పోలైన సందర్భంగా ఆ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు జరిపించాలని కోరుతూ బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ పిల్ వేశారు. ఈ పిటిషన్ ను సుప్రీం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది.

విచారణ సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాది మేనకా గురుస్వామి వాదిస్తూ... ప్రస్తుతం నోటాకు అభ్యర్థుల్ని నిరాకరించే హక్కు మాత్రమే ఉందని, దాన్ని ఓటుగా గుర్తించాలని కోరారు. ఈ నేపథ్యంలో, దీనిపై అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

More Telugu News