Mayanmar: సైన్యం ఆదేశాలు నచ్చక.. ఇండియాకు పారిపోతున్న మయన్మార్ పోలీసులు!

  • మయన్మార్ లో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చిన సైన్యం
  • ప్రజలపై విరుచుకుపడాలని పోలీసులను ఆదేశిస్తున్న సైన్యం
  • దారుణాలు చేయలేక ఇండియాలోకి వస్తున్న పోలీసులు
Hundreds of Mayanmar police entered into India

మయన్మార్ లోని ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యం కూల్చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న పాలనను తన చేతుల్లోకి తీసుకుంది. దీంతో, సైన్యానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళనలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో, నిరసనలకు పాల్పడుతున్న ప్రజలపై సైన్యం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో ప్రజలపై విరుచుకుపడాలంటూ పోలీసులను సైన్యం ఆదేశిస్తోంది.

సైన్యం ఆదేశాలను పాటించడం ఇష్టం లేని కొందరు పోలీసులు ఆ దేశాన్ని వీడి భారత్ లోకి ప్రవేశించారు. ఈరోజు వరకు మొత్తం 264 మంది భారత్ లోకి ప్రవేశించారని, వీరిలో 198 మంది పోలీసు అధికారులని మన అధికారులు చెపుతున్నారు. సైన్యం చేస్తున్న దమనకాండలో పాలుపంచుకోవడం ఇష్టంలేకే వారు మిజోరాం రాష్ట్రం గుండా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారని అంటున్నారు.

మన దేశంలోకి ప్రవేశించిన ఓ పోలీసు అధికారి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, సైనిక పాలకులు ఆదేశాలను పాటించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో విజయం సాధించవచ్చనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

More Telugu News