ITBP: ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు... సొరంగంలో చిక్కుకున్న 16 మందిని కాపాడిన భద్రతా బలగాలు

  • చమోలీ ప్రాంతంలో విరిగిపడిన కొండ చరియలు
  • ధౌలిగంగా నదిలో హఠాత్తుగా పెరిగిన నీటిమట్టం
  • దిగువన ఉన్న ప్రాంతాలు జలమయం
  • తపోవన్ విద్యుత్ ప్రాజెక్టు నీట మునక
ITBP rescues sixteen people in a tunnel

ఉత్తరాఖండ్ లోని చమోలీ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా నదికి వరదలు సంభవించడం తెలిసిందే. ఈ వరదల కారణంగా రిషిగంగా ప్రాంతంలోని తపోవన్ విద్యుత్ ప్రాజెక్టు నీట మునిగింది. సహాయక చర్యలు చేపట్టిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది ఓ సొరంగం నుంచి 16 మందిని కాపాడారు. ఆకస్మిక వరదలు వచ్చిన సమయంలో ఈ కార్మికులు సొరంగంలో పనులు చేస్తున్నారు. ఒక్కసారిగా బురదతో కూడిన వరద రావడంతో వారు బయటికి వచ్చే మార్గంలేక అందులోనే చిక్కుకుపోయారు.

అయితే, ఐటీబీపీ సిబ్బంది ఎంతో శ్రమించి వారిని బయటికి తీశారు. కాగా, ఈ వరదల్లో 150 మంది వరకు గల్లంతైనట్టు భావిస్తున్నారు. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలు వెలికితీసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అటు, మృతుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సర్కారు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించనుంది.

More Telugu News