New Delhi: కరోనాను జయించిన న్యూఢిల్లీ... సగం మందిలో యాంటీ బాడీలు!

  • 56.1 శాతం మందిలో ఇమ్యూనిటీ
  • మందులు లేకుండానే స్వస్థత పొందుతున్న ప్రజలు
  • సౌత్ ఈస్ట్ ఢిల్లీలో అత్యధికంగా 62.2 శాతం హెర్డ్ ఇమ్యూనిటీ
  • ప్రజలు నిబంధనలు పాటించాలన్న ఆరోగ్య మంత్రి
Above Half of New Delhi People Have Corona Anti Bodies

కరోనా మహమ్మారిపై విజయం సాధించే దిశగా దేశ రాజధాని పరుగులు పెడుతోంది. ఢిల్లీ వాసుల్లోని ప్రతి ఇద్దరిలో ఒకరి శరీరంలో వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయి. తాజాగా నిర్వహించిన సీరో సర్వేలో ఢిల్లీలోని 56.1 శాతం మందిలో యాంటీ బాడీల వృద్ధి కనిపించిందని పేర్కొంది. ప్రజల్లో సగం మందికి పైగా కరోనా బారిన పడి ఏ విధమైన మందులు తీసుకోకుండానే స్వస్థత పొందారని పేర్కొంది.

ఇక సౌత్ ఈస్ట్ ఢిల్లీ వాసుల్లోని 62.2 శాతం మందిలో కరోనా యాంటీ బాడీలు ఉండగా, నార్త్ ఢిల్లీ ప్రజల్లో 49.1 శాతం మందిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని ఈ సర్వే వెల్లడించింది. నగరంలో హెర్డ్ ఇమ్యూనిటీ గణనీయంగా పెరిగిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి సత్యేందర్ జైన్, ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని, అశ్రద్ధ వహించవద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా, హస్తినలో కరోనా చైన్ బ్రేక్ అయినట్టేనని, ఏ ప్రాంతంలోనైనా ఓ వ్యాధి ప్రబలితే 50 శాతానికి పైగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన తరువాతే, దాని వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్టని వ్యాఖ్యానించిన ఢిల్లీ ఎయిమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్, కరోనా విషయంలో ఢిల్లీ కీలక మైలురాయిని అధిగమించి, విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. అంతకుముందు జరిగిన సీరో సర్వేలో 49 శాతం హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడినట్టు తేలగా, ఇప్పుడది మరో 8 శాతానికి పైగా పెరగడం గమనార్హం.

ఇదిలావుండగా, ఇప్పటివరకూ పలుమార్లు దేశవ్యాప్తంగా సీరో సర్వేలు జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ లో జరిగిన సర్వేలో 28 వేల శాంపిల్స్ ను తీసి పరిశీలించగా, 25.5 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నాయని వెల్లడైంది. ఆపై జనవరి 15 నుంచి 23 మధ్య ఐదేళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి మరో 28 వేల శాంపిల్స్ సేకరించి పరిశీలించగా, యాంటీ బాడీలను కలిగున్న వారి సంఖ్య 49 శాతానికి పెరిగినట్టు తేలింది. ఢిల్లీ విషయానికి వస్తే, తొలి సీరో సర్వే జూలైలో జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెలా ఈ సర్వే జరుగుతుండగా, తొలుత 22.8 శాతంగా ఉన్న హెర్డ్ ఇమ్యూనిటీ, క్రమంగా పెరుగుతున్నట్టు వెల్లడైంది.

More Telugu News