Vellampalli Srinivasa Rao: గత ప్రభుత్వం 40 ఆలయాలను కూల్చేసినప్పుడు కన్నా ఎందుకు మాట్లాడలేదు?: వెల్లంపల్లి

  • గోదావరి పుష్కరాల్లో 23 మంది ప్రాణాలుకోల్పోతే ఎందుకు నిలదీయలేదు
  • చంద్రబాబు నుంచి డబ్బులు తీసుకుని మౌనంగా ఉండిపోయారు
  • అప్పట్లో నేను దేవాలయాలు పడగొట్టడాన్ని అడ్డుకున్నాను
  • పవన్ కల్యాణ్ బూట్లు వేసుకుని పూజలు చేస్తారు
vellampally fires on kanna

దేవాలయాల భూముల అమ్మకంపై సర్కారు తీరుపై ప్రశ్నిస్తోన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గోదావరి పుష్కరాల్లో 23 మంది ప్రాణాలుకోల్పోతే కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలోని 40 ఆలయాలను కూల్చేసినప్పుడు కూడా కన్నా మాట్లాడలేదని ఆయన విమర్శించారు.

చంద్రబాబు నాయుడి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. అప్పట్లో టీటీడీ బోర్డు సభ్యుడయిన భాను ప్రకాశ్‌ రెడ్డి కూడా ఆ ఆలయ ఆస్తులను అమ్మాలని సంతకాలు చేశారని ఆయన చెప్పారు. తాను అప్పట్లో బీజేపీలో ఉన్న సమయంలో దేవాలయాలు పడగొట్టడాన్ని అడ్డుకున్నానని, దీంతో తనను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.

దీనిపై అప్పట్లో బీజేపీ స్పందిస్తూ.. తమకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని తెలిపిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దేవాలయాల డబ్బులను ఇమామ్‌లకి, పాస్టర్లకు ఇస్తోందని కొందరు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జనసేన నేత పవన్ కల్యాణ్ బూట్లు వేసుకుని పూజలు చేస్తారని ఆయన చెప్పారు.

More Telugu News