Iran: ఇరాన్ లో పంజా విసిరిన కరోనా.. చిక్కుకుపోయిన 340 మంది గుజరాతీలు

  • ఇరాన్ లో చేపలు పట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న గుజరాతీలు
  • కరోనా వైరస్ కారణంగా విమానాశ్రయాలను మూసేసిన ఇరాన్
  • తీవ్ర ఆందోళనలో అక్కడి గుజరాతీలు
340 Gujaratis stuck in Iran

ఇరాన్ ను కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ దేశ ఉపాధ్యక్షురాలితో పాటు 245 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, గుజరాత్ కు చెందిన 340 మంది మత్స్యకారులు ఇరాన్ లో చిక్కుకుపోయారనే వార్త ఆందోళనను రేకెత్తిస్తోంది. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడి విమానాశ్రయాలను ఆ దేశం మూసేసింది. దీంతో ఆ దేశంలో నివాసం ఉంటున్న గుజరాత్ మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

వీరంతా గుజరాత్ లోని దండి, కల్గం, భత్కడి, మరోలి, వల్సద్, నార్గోల్ ప్రాంతాలకు చెందినవారు. ఇరాన్ లోని చిరుయేహ్, బందర్ ఏ చిరు, హర్మోజగన్ ప్రావిన్సుల్లో నివాసం ఉంటున్నారు. వీరిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలంటూ భారత విదేశాంగ శాఖకు కేంద్ర అటవీ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి రమణ్ లాల్ పాట్కర్ లేఖ రాశారు. వీరంతా ఇరాన్ లో చేపల పడవలను అద్దెకు తీసుకుని, చేపలు పట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఒక ప్రత్యేక విమానాన్ని ఇరాన్ కు పంపించి వారిని భారత్ కు తీసుకురావాలని బాధితుల బంధువులు కోరుతున్నారు.

More Telugu News