Kadapa District: ప్రేమ పేరిట వేధింపులు... ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

  • ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లిన తల్లిదండ్రులు
  • ఇంటర్ చదువుతుంటే నిత్యమూ వేధించిన యువకుడు
  • మనస్తాపంతో ఉరేసుకున్న హరిత

తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తమ కూతుర్ని మాత్రం బాగా చదివించాలన్న ఉద్దేశంతో ఆమెను బంధువుల ఇంట ఉంచారు. అయితే, ఆ బాలిక ఓ యువకుడి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా పెనగలూరు మండలం గట్టువారిపల్లెలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈశ్వరయ్య, లక్ష్మీదేవి దంపతులు విదేశాల్లో ఉండగా, వారి కుమార్తె హరిత (18) రాజంపేటలో ఇంటర్ చదువుతోంది.

సమీపంలోని సిరివరం గ్రామానికి చెందిన ఓ యువకుడు రాజంపేటలో డిగ్రీ చదువుతూ, నిత్యమూ హరిత వచ్చి వెళ్లే బస్సులోనే ప్రయాణించేవాడు. ఈ క్రమంలో హరితను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆ బాలిక అంగీకరించకపోవడంతో వేధింపులు ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న హరిత బంధువులు, సదరు యువకుడిని హెచ్చరించినా, పద్ధతి మార్చుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని వెల్లడించారు.

More Telugu News